Indonesia: ఇండోనేషియా నౌకాదళంలోకి తొలి విమాన వాహక నౌక.. 'కేఆర్ఐ శ్రీవిజయ'
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియా నౌకాదళ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశానికి చెందిన తొలి విమాన వాహక నౌకగా ఇటలీ నుంచి బదిలీ అయిన ఐటీఎస్ గిసెప్పే గారిబాల్డి శుక్రవారం ఉదయం ఉత్తర జకార్తాలోని తాంజుంగ్ ప్రియోక్ నౌకాశ్రయానికి చేరుకుంది. 41 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నౌకను ఇటలీ ప్రభుత్వం ఇండోనేషియాకు గ్రాంట్ రూపంలో ఉచితంగా అందించింది. ఇండోనేషియా జలాల్లోకి ప్రవేశించిన గిసెప్పే గారిబాల్డికి ఆ దేశ యుద్ధనౌకలు స్వాగతం పలికాయి. అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య దానిని తాంజుంగ్ ప్రియోక్ పోర్టు వరకు తీసుకెళ్లాయి.
వివరాలు
నౌకకు అధికారిక స్వాగతం
ఇండోనేషియా రక్షణ మంత్రి స్జాఫ్రీ స్జామ్సోద్దీన్, త్రివిధ దళాల అధిపతులు నౌకకు అధికారికంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నేవల్ ఏవియేషన్ సెంటర్కు చెందిన ఐదు విమానాలు పోర్టు పరిసరాల్లో వైమానిక ప్రదర్శన నిర్వహించాయి.
ఆగస్టు 24న ఇటలీ నుంచి బయలుదేరిన ఈ నౌక, ఈ నెల 25న ఇండోనేషియా నౌకాదళంలో అధికారికంగా చేరనుంది.
అక్కడ దీనికి 'కేఆర్ఐ శ్రీవిజయ'గా పేరు పెట్టనున్నారు. నౌకాదళంలోకి చేర్చే కార్యక్రమానికి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు.
వివరాలు
విపత్తు సహాయ చర్యలకే ప్రాధాన్యం
కొత్తగా చేరనున్న విమాన వాహక నౌకను ప్రధానంగా సైనిక కార్యకలాపాల కోసం కాకుండా విపత్తు సహాయ, మానవతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా హెలికాప్టర్ల సాయంతో కార్చిచ్చులను అదుపుచేయడం వంటి చర్యల్లో ఈ నౌకను ఉపయోగించవచ్చని అధ్యక్షుడు ప్రబోవో తెలిపారు.
వివరాలు
ఆధునికీకరణ, నిర్వహణ ఖర్చులపై విమర్శలు
అయితే, 41 ఏళ్ల నాటి ఈ నౌకను స్వీకరించడంపై ఇండోనేషియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నౌక ఆధునికీకరణకు సుమారు 7.2 ట్రిలియన్ల రుపియాలు ఖర్చవుతాయని రక్షణ శాఖ అంచనా వేసింది.
అయితే, మరమ్మతులు, ఇతర అవసరాలతో కలిపి మొత్తం వ్యయం 16 ట్రిలియన్ల రుపియాలకు చేరవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇంత భారీ మొత్తాన్ని పాత నౌక ఆధునికీకరణకు ఖర్చు చేయడం కంటే, కొత్త యుద్ధనౌకలను కొనుగోలు చేయడం ప్రయోజనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీంతో గిసెప్పే గారిబాల్డి రాక ఇండోనేషియా నౌకాదళానికి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచినప్పటికీ, దాని నిర్వహణ, ఆధునికీకరణ వ్యయంపై చర్చ కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండోనేషియాకు చేరిన తొలి విమాన వాహక నౌక
"WELCOME TO THE SEA GIANT, INDONESIA'S PROTECTIVE SEA FORTRESS"
— Lembaga KERIS (@LembagaKERIS) September 17, 2026
Setelah berlayar dari Italia pada 24 Agustus yang lalu, ITS Giuseppe Garibaldi telah tiba di Tanah Air dan sedang berlayar menuju Jakarta. Kedatangan kapal induk perdana ini dikawal langsung oleh 2 Fregat kelas… pic.twitter.com/ACjWtZ25fo