MQ-9 Drone: అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను కూల్చేశాం.. మరిన్ని దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడిన అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా ఆర్క్యూ-4 నిఘా డ్రోన్తో పాటు ఎఫ్-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. టెహ్రాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా భారీ దాడులు నిర్వహించిన నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకునే పూర్తి హక్కు తమకు ఉందని ఇస్లామిక్ విప్లవ గార్డ్స్ దళాలు స్పష్టం చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సైనిక చర్యలకు దిగితే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై ఊహించని దాడులు చేస్తామని హెచ్చరించాయి.
వివరాలు
అమెరికా, ఇజ్రాయెల్లను పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యం
ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో అమెరికా దాడులు చేయడాన్ని అస్సలు అంగీకరించబోమన్నారు. ఈ దాడులకు తగిన ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇకపై పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఏ స్థావరమూ సురక్షితంగా ఉండదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్లను పూర్తిగా బలహీనపరచడమే తమ లక్ష్యమని తెలిపారు. తన తండ్రి, ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా ఖమేనీ మరణించిన తర్వాత కూడా దేశ రక్షణ కోసం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
ఆత్మరక్షణ కోసమే దాడులు: అమెరికా
మరోవైపు అమెరికా అధికారులు తమ చర్యలను సమర్థించుకున్నారు. ఇరాన్పై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయలేదని, కేవలం ఆత్మరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సముద్ర మార్గాల్లో మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.