Iran: హోర్ముజ్ సంక్షోభం.. చమురు ద్వారా ఇరాన్ రోజువారీ ఆదాయం రూ.1310 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధం ఇరాన్కు అనుకోని లాభాలను తెచ్చిపెడుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు విక్రయాల ద్వారా ఇరాన్ వందల మిలియన్ల డాలర్ల అదనపు ఆదాయాన్ని సంపాదించినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిని వినియోగించగల ప్రధాన ఎగుమతిదారుగా నిలవడంతో పెరిగిన ముడి చమురు ధరలు టెహ్రాన్కు భారీగా కలిసొచ్చాయి.
వివరాలు
పెరిగిన ధరలు.. తగ్గిన డిస్కౌంట్..రెట్టింపు లాభం
యుద్ధం కారణంగా ఇరాన్కు ద్విగుణీకృత ప్రయోజనం కలుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లకు పైగా చేరింది. ఇదే సమయంలో ఇరాన్ తన చమురును గత 10 నెలల్లో ఎప్పుడూ లేనంత తక్కువ డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే... ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు మౌలిక సదుపాయాలపై అమెరికా ఎలాంటి దాడులు చేయడం లేదు. అంతేకాకుండా, సముద్రంలో ఉన్న ట్యాంకర్లపై ఇరాన్ చమురుకు విధించిన ఆంక్షలను ప్రపంచ ధరలను నియంత్రించేందుకు వాషింగ్టన్ తాత్కాలికంగా సడలించింది. ఈ పరిణామాలపై కొలంబియా యూనివర్సిటీ నిపుణుడు రిచర్డ్ నెఫ్యూ మాట్లాడుతూ... "ట్రంప్ ప్రభుత్వం ఆచరణలో ఇరాన్ను చమురు అమ్మమని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
రోజువారీ ఆదాయం భారీగా పెరుగుదల
Tankertrackers.com అంచనాల ప్రకారం, ఇరాన్ రోజువారీ చమురు ఆదాయం ఫిబ్రవరిలో 115 మిలియన్ డాలర్లుగా ఉండగా, మార్చిలో అది 139 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1310 కోట్లు) పెరిగింది. చమురు ఎగుమతులు రోజుకు సుమారు 1.6 మిలియన్ బ్యారెళ్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్య ఎగుమతి కేంద్రం అయిన ఖర్గ్ ఐలాండ్లో కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా సాగుతున్నాయి.
వివరాలు
ఇతర గల్ఫ్ దేశాలకు దెబ్బ
ఇదే సమయంలో, ఇతర గల్ఫ్ దేశాలు మాత్రం యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇరాక్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చర్చలపై విభేదాలు... యుద్ధం కొనసాగింపు ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా, ఇరాన్ అధికారులు మాత్రం అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను తిరస్కరించిన ఇరాన్, దాడులను కొనసాగిస్తోంది.