Iran Embassy: 'ప్రాణాలు త్యాగం చేయండి'.. ఇరాన్ పోస్టుపై తీవ్రంగా స్పందించిన యూకే
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, యూకేలో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన ఒక ప్రకటన పెద్ద చర్చకు దారి తీసింది. అమెరికా-ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో శత్రువుకు తలవంచొద్దని, దేశాన్ని వారికి అప్పగించే బదులు ప్రాణాలు అర్పించాలంటూ యూకేలో నివసిస్తున్న ఇరాన్ పౌరులకు పిలుపునిచ్చింది. బలిదానానికి సిద్ధంగా ఉన్న వారు తమను సంప్రదించాలని కూడా కోరింది. ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారి తీసి, అనేక మంది తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రకటన ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని యూకే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, ఇలాంటి ప్రకటన చేసినందుకు ఆ దేశ రాయబారి సయ్యద్ అలీ మౌసావినికి సమన్లు జారీ చేశారు.
వివరాలు
ప్రకటనను సమర్థించుకున్న ఇరాన్ దౌత్య కార్యాలయం
అయితే, ఇరాన్ దౌత్య కార్యాలయం తమ ప్రకటనను సమర్థించుకుంది. ఇది దేశభక్తి, దేశంపై విధేయతను ప్రోత్సహించే సందేశమని, హింసను ప్రేరేపించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ పౌరులు ఎప్పుడూ తమ మాతృభూమి రక్షణకు సిద్ధంగా ఉంటారని పేర్కొంది. ఇటీవల యుద్ధ పరిస్థితుల్లో ప్రాణత్యాగానికి తాను సహా ఇరాన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య దౌత్య కార్యాలయం చేసిన ప్రకటన మరింత ఆందోళన కలిగిస్తోంది.