Iran oil tanker:భారత్కు రావాల్సిన ఇరాన్ చమురు ట్యాంకర్ చైనా వైపు మళ్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్కు చేరాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ 'పింగ్ షున్' తన ప్రయాణ దిశను మార్చుకుని చైనా వైపు కదులుతున్నట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. మొదట ఈనౌక ఈ నెల 4న గుజరాత్లోని వడినార్ పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా,తాజా సమాచారం ప్రకారం ఇది చైనాలోని డోగియింగ్ దిశగా ప్రయాణిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మార్గమధ్యంలో గమ్యాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మార్చి 4న ఖర్గ్ ద్వీపం సమీపంలో ఈ ట్యాంకర్లో చమురు లోడింగ్ జరిగినట్లు కెప్లర్ తెలిపింది. సుమారు 6లక్షల బ్యారెళ్ల ముడిచమురు ఇందులో ఉండే అవకాశం ఉందని అంచనా. ఇలాంటి సమయంలో ఇరాన్ చమురు నౌక ఆకస్మికంగా చైనా వైపు మళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
ఇరాన్పై ఆంక్షలు విధించిన అమెరికా
గతంలో భారత్ ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది. ఒక దశలో దేశం మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా సుమారు 11.5 శాతంగా ఉండేది. 2018లో భారత్ రోజుకు సుమారు 5.18 లక్షల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోగా, 2019 మే నాటికి అది రోజుకు 2.68 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అనంతరం, ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.
వివరాలు
ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఆంక్షలను సడలించిన అమెరికా
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చమురు ధరలను నియంత్రించాలనే ఉద్దేశంతో అమెరికా తాత్కాలికంగా (30 రోజుల పాటు) ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఈ నిర్ణయం తర్వాత 2019 అనంతరం మొదటిసారిగా ఇరాన్ నుంచి భారత్ వైపు చమురు నౌక ప్రయాణం ప్రారంభమైనట్లు కెప్లర్ తాజాగా వెల్లడించింది.