Esmaeil Baghaei: అమెరికా భూతల దాడి చేస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్ ఘాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
భూతల దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. ముఖ్యంగా ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగితే గట్టి ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. ఒప్పందం పరిమాణంలో చిన్నదైనా, అందులో మొత్తం 14 క్లాజ్లు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. హర్మూజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఇరాన్కే చెందుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఒమన్తో పాటు ప్రాంతీయ దేశాలతో చర్చలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఒప్పందంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నందున వాటిని ఉల్లంఘించే అవకాశం అమెరికాకు లేదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఖర్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకం
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యలను మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే సైనిక సామర్థ్యం అమెరికాకు ఉన్నప్పటికీ,దానిని దీర్ఘకాలం తమ ఆధీనంలో కొనసాగించడం అంత సులభం కాదని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ అమెరికా సైనిక చర్యలకు దిగితే,ఇరాన్ క్షిపణులు,డ్రోన్లతో ఎదురుదాడులు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలక కేంద్రంగా ఉంది.
దేశ మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ద్వీపం ద్వారానే జరుగుతుండటంతో దీనికి వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం ఉంది.