Iran: యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన ప్రకటన.. పొరుగు దేశాలకు క్షమాపణ
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మసౌద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అధ్యక్షుడైన ఆయన టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పక్క దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు. అలాగే ఇరుగుపొరుగు దేశాలకు క్షమాపణలు కూడా తెలిపారు. మా జోలికి ఎవరూ రాకపోతే.. మేమూ వారి జోలికి వెళ్లము. అయితే ఇజ్రాయెల్, యూఎస్లకు లొంగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఇరాన్ను లొంగదీసుకోవాలని కలలు కనే వారు తప్పక విఫలమవుతారని కూడా హెచ్చరించారు. ప్రసంగ సమయంలో పెజెష్కియన్ శాంతి సంకేతంగా 'శాంతి హస్తం'ను చూపించారు. ఇరాన్ శాంతిని కోరుకునే దేశమని, ప్రాంతీయ స్థిరత్వం కోసం సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
Details
ప్రాంతీయ పరిస్థితులపై కీలక చర్చ
అదే సమయంలో దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు తమ వైఖరి దృఢంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, టెలివిజన్ ప్రసంగానికి ముందు పెజెష్కియన్ వ్లాదిమర్ పుతిన్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రాంతీయ పరిస్థితులపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా మద్దతు ఇస్తుందని పుతిన్ పేర్కొన్నారని సమాచారం. ఏ సమస్యనైనా బలప్రయోగంతో కాకుండా చర్చలు, దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలిసింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడే ఇరాన్ వైఖరిలో ఈ మార్పుకు కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ భయాలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.