LOADING...
Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం.. పునర్నిర్మాణానికి పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం.. పునర్నిర్మాణానికి పిలుపు

Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం.. పునర్నిర్మాణానికి పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడులు కొనసాగిస్తున్నాయని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా విమర్శించారు. ఈ దాడులతో దేశంలోని మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ చర్యలను ఖండించిన ఆయన, ఈ దాడుల వల్ల కేవలం మౌలిక వసతులే కాకుండా పర్యావరణానికి కూడా నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో దేశం అంతర్గత అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధిని విస్తరించడం ద్వారా ఇరాన్‌కు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

వివరాలు 

మినాబ్ ప్రాంతంలోని పాఠశాలపై దాడి 

ఈ సందర్భంగా మినాబ్ ప్రాంతంలోని ఒక పాఠశాలపై జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు. ఆ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

అమెరికా ప్రజలకు బహిరంగ లేఖ

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనా ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని ఆశ్రయించలేదని తెలిపారు. అయితే తమపై జరుగుతున్న దాడులకు ధైర్యంగా, దృఢంగా ప్రతిస్పందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా పరిపాలన నిజంగా 'అమెరికా ఫస్ట్' విధానాన్ని అనుసరిస్తుందా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.

Advertisement