Iran: యుద్ధం ఆగాలంటే మూడు డిమాండ్లు: ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలంటే మూడు ప్రధాన షరతులు పాటించాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ వెల్లడించారు. కొన్ని కీలక డిమాండ్లు నెరవేరితేనే ఈ ఘర్షణకు ముగింపు పలకడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇరాన్ చట్టబద్ధ హక్కులను అధికారికంగా గుర్తించాలి, యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, ఇకపై ఇరాన్పై ఎలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ హామీ ఇవ్వాలని పేజెష్కియన్ పేర్కొన్నారు. ఈ మూడు షరతులు నెరవేరితే యుద్ధాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
వివరాలు
రష్యా,పాకిస్తాన్ నాయకులతో మాట్లాడిన తర్వాత,పెజెష్కియన్ షరతు
రష్యా, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడిన తర్వాత పేజెష్కియన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థిరపడాలని ఇరాన్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అయితే జియోనిస్టు పాలన,అమెరికా ప్రోత్సహించిన యుద్ధాన్ని ముగించాలంటే, ఇరాన్కు ఉన్న హక్కులను అంగీకరించడం,నష్టపరిహారం ఇవ్వడం, భవిష్యత్తులో మళ్లీ దాడులు జరగకుండా అంతర్జాతీయ హామీ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
13వ రోజుకు యుద్ధం
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ మొదలైంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనేయి సహా 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇక మినాబ్ ప్రాంతంలో ఉన్న బాలికల పాఠశాలపై అమెరికా క్షిపణి దాడి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ దాడిలో 165 మంది విద్యార్థినులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు, ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు ప్రారంభించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు సరఫరాపై ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది.