Iran: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సాయుధ పడవలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ దళాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా చర్యలకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని ఐఆర్జీసీ అధికారిక వార్తా సంస్థ 'సెపా న్యూస్' విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. హర్మూజ్ జలసంధి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్న ఇరాన్, అక్కడ తమ నౌకాదళం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపింది. ఎలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడినా తీవ్రంగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరించింది.
వివరాలు
తమ దళాల రక్షణ కోసమే ఆత్మరక్షణ దాడులు చేశామన్న అమెరికా
ఇదిలా ఉండగా,ఇరాన్ దళాల నుంచి ముప్పు ఉన్నందున తమ సైనికుల భద్రత కోసమే ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ వెల్లడించారు. దక్షిణ ఇరాన్లోని క్షిపణి స్థావరాలు,సముద్రంలో మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఆత్మరక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక సంధి నిబంధనలను పాటిస్తూనే తమ దళాల రక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. మరోవైపు, అమెరికా నావికా దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ గల్ఫ్ ప్రాంత నౌకా రవాణాపై తమకే నియంత్రణ ఉందని ఇరాన్ ప్రకటించింది. గత 24 గంటల్లో తమ పర్యవేక్షణలోనే 25 చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటినట్లు ఐఆర్జీసీ తెలిపింది.
వివరాలు
ఇజ్రాయెల్, అమెరికా అనుబంధ నౌకలపై ఇరాన్ ఆంక్షల కొనసాగింపు
అమెరికా మాత్రం ఇరాన్పై అమలు చేస్తున్న నావికా దిగ్బంధం కారణంగా గత వారం రోజుల్లో సుమారు వంద నౌకల మార్గాలను మళ్లించామని, నాలుగు నౌకలను నిలిపివేశామని వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధాలు ఉన్న నౌకల రాకపోకలను ఇరాన్ నిషేధించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజా దాడుల ప్రభావంతో ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉన్న బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందానికి భంగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి మరింత విషమిస్తే అంతర్జాతీయ ఇంధన రవాణా దెబ్బతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.