LOADING...
US-Iran: జలసంధి ఉద్రిక్తతల మధ్య అమెరికా-ఇరాన్‌ ఘర్షణలు.. చర్చల ప్రతిపాదనకు ఇరాన్‌ నో
చర్చల ప్రతిపాదనకు ఇరాన్‌ నో

US-Iran: జలసంధి ఉద్రిక్తతల మధ్య అమెరికా-ఇరాన్‌ ఘర్షణలు.. చర్చల ప్రతిపాదనకు ఇరాన్‌ నో

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
07:53 am

ఈ వార్తాకథనం ఏంటి

హోర్ముజ్‌ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌తో చర్చలను పునఃప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్‌ ఖండించింది. బెదిరింపులతో చర్చలు సాధ్యం కావని స్పష్టంగా పేర్కొంది. ఇరాన్‌తో రెండో దఫా చర్చల కోసం తమ ప్రతినిధులు సోమవారం పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. హోర్ముజ్‌ జలసంధిలో శనివారం ఇరాన్‌ కొన్ని నౌకలపై కాల్పులు జరిపిందని, ముఖ్యంగా ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. ఇది సరైన చర్య కాదని విమర్శించారు. సోమవారం సాయంత్రం తమ ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు చేరుకుని ముఖాముఖి చర్చలు జరపనున్నారని చెప్పారు.

వివరాలు 

చమురు అవసరాల కోసం అమెరికాకు ప్రపంచ దేశాలు 

ఇటీవల జలసంధిని మూసివేసినట్టు ఇరాన్‌ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, విచిత్రం ఏమిటంటే.. మేము ఎప్పుడో దానిని మూసేశాం. వారికి తెలియకుండానే జలసంధిని మూసివేయటంలో మాకు సహాయం చేస్తున్నారు. జలసంధి మూసివేత వల్ల ఇరాన్‌కు రోజుకు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని,తమకు మాత్రం ఎలాంటి నష్టం లేదని తెలిపారు. పైగా ప్రపంచ దేశాల నుంచి చమురు అవసరాల కోసం నౌకలు తమ దేశానికి వస్తున్నాయని చెప్పారు. ఇరాన్‌ విప్లవ రక్షక దళానికి వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌కు అనుకూలమైన ఒప్పంద ప్రతిపాదన పంపామని, దానికి వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అలా కాకపోతే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

వివరాలు 

చర్చలకు మేము రాం: ఇరాన్

ఇరాన్‌ పాలనను ముగించే సమయం వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ప్రకటనకు ముందుగానే పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో భద్రతను గట్టిగా పెంచారు. ట్రంప్‌ ప్రతిపాదనను ఇరాన్‌ కఠినంగా తిరస్కరించింది. ఒకవైపు దాడుల బెదిరింపులు చేస్తూ, మరోవైపు చర్చలకు రావాలని ఒత్తిడి చేయడం బాలిశిష్టంగా ఉందని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మొహమ్మద్‌ రజా ఆరెఫ్‌ విమర్శించారు. తమ దేశ ప్రతినిధులు ఎవరూ చర్చలకు వెళ్లబోరని అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా డిమాండ్లు అతిగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అణు ఇంధనంపై తమకు ఉన్న హక్కులను ఎవరూ అడ్డుకోలేరని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ముందుగా స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

అనుమతి ఇచ్చి కాల్పులా?

హోర్ముజ్‌ జలసంధి దాటేందుకు భారత నౌకలు ప్రయత్నించిన సమయంలో ఇరాన్‌ నౌకాదళం కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల సమయంలో ఒక నౌక సిబ్బంది ఇరాన్‌ నౌకాదళంతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం సంబంధించిన శబ్ద రికార్డు బయటపడింది. భారత పతాకంతో ప్రయాణిస్తున్న సన్మర్‌ హెరాల్డ్‌, జగ్‌ అర్నవ్‌ నౌకలపై కాల్పులు జరిగాయి. సన్మర్‌ హెరాల్డ్‌లోని సిబ్బంది తమకు ముందే అనుమతి ఇచ్చారని, ఇప్పుడు కాల్పులు జరపడం ఎందుకని ప్రశ్నిస్తూ వెనక్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మాటలు ఆ రికార్డులో వినిపించాయి.

Advertisement

వివరాలు 

అనుమతి ఇచ్చి కాల్పులా?

ఇదిలా ఉండగా దేశ్‌ గరిమా అనే భారత చమురు నౌక సురక్షితంగా జలసంధిని దాటి భారత్‌ వైపు ప్రయాణిస్తోంది. ఈ నెల 22న ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫ్రాన్స్‌, బ్రిటన్‌ నౌకలపైనే కాల్పులు జరిగాయని ట్రంప్‌ పేర్కొనగా, భారత నౌకలపై కాల్పుల గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.

Advertisement