LOADING...
Iran-US peace deal: ఇరాన్‌కు చెందిన రూ.8.5లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అసలు కథ ఇదే!
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అసలు కథ ఇదే!

Iran-US peace deal: ఇరాన్‌కు చెందిన రూ.8.5లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అసలు కథ ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు చెందిన భారీ మొత్తంలో స్తంభింపజేసిన (Frozen) ఆస్తులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం,తొలి దశలో 12 బిలియన్ డాలర్లు,ఆ తర్వాత మరో 12 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని ప్రతిపాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇరాన్‌కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎందుకు నిలిపివేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ 14న ప్రకటించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఈ వారంలో స్విట్జర్లాండ్‌లో సంతకాలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు 

ఇరాన్‌కు చెందిన ఆస్తుల విలువ సుమారు 100బిలియన్ డాలర్లుగా అంచనా

14 అంశాలతో కూడిన ఈ అవగాహన ఒప్పందం(MoU)ప్రకారం 60రోజుల చర్చల వ్యవధిలో మొత్తం 24బిలియన్ డాలర్ల ఇరానీ ఆస్తులను విడుదల చేసే మార్గం సుగమం కావచ్చని సమాచారం. అయితే,నిధులు విడుదలైన తర్వాతే అణు చర్చలు ప్రారంభమవుతాయని ఇరాన్ చెబుతుండగా, అమెరికా అధికారులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన లేదా పరిమితుల కింద ఉన్న ఆస్తుల విలువ సుమారు 100బిలియన్ డాలర్లుగా అంచనా. ఇందులో చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం,విదేశీ మారక నిల్వలు,బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక ఆస్తులు ఉన్నాయి. అయితే తాజా ఒప్పందంలో వీటిలో ఏ ఆస్తులను విడుదల చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ ఆస్తుల స్తంభన చరిత్ర దాదాపు ఐదుదశాబ్దాల నాటిది.

వివరాలు 

1981లో కుదిరిన ఒప్పందం ద్వారా విడుదలైన ఆస్తులు

1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం అనంతరం టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని విప్లవకారులు స్వాధీనం చేసుకుని 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచారు. ఈ ఘటన తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అమెరికా పరిధిలో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఆస్తులను నిలిపివేశారు. అప్పట్లో దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ మారక నిల్వలు, ఇతర ఆస్తులు స్తంభించిపోయాయి. అనంతరం 1981లో కుదిరిన ఒప్పందం ద్వారా చాలా వరకు విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న నిధులు 2018 తర్వాత విధించిన అమెరికా ఆంక్షలతో సంబంధం కలిగి ఉన్నాయి.

Advertisement

వివరాలు 

ట్రంప్ అమలు చేసిన "మ్యాక్సిమమ్ ప్రెజర్"

2015లో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించారు. అణు కార్యక్రమాలు, క్షిపణి అభివృద్ధి, ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో ఇరాన్ చమురు ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని విదేశీ బ్యాంకుల్లోనే నిలిపివేయాల్సి వచ్చింది. ట్రంప్ అమలు చేసిన "మ్యాక్సిమమ్ ప్రెజర్" విధానంలో భాగంగా ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు, బ్యాంకులపై కూడా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్‌కు సంబంధించిన మరిన్ని నిధులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిలిచిపోయాయి.

Advertisement

వివరాలు 

2023లో అమెరికా-ఇరాన్ ఖైదీల మార్పిడి ఒప్పందం

ఇరాన్ నుంచి పరిమిత స్థాయిలో చమురు కొనుగోలు చేసిన దక్షిణ కొరియా,జపాన్, భారత్ తదితర దేశాలు నేరుగా చెల్లింపులు చేయలేక ప్రత్యేక ఎస్క్రో లేదా పరిమిత ఖాతాల్లో ఆ డబ్బును నిల్వ చేశాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరించాయి. ఇప్పటివరకు ఆ నిధుల్లో కొంత భాగమే విడుదలైంది. తాజా ఒప్పందంలో తొలి విడతగా విడుదలయ్యే 12 బిలియన్ డాలర్లలో విదేశీ ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా ఖతార్‌లో ఉన్న ఇరానీ నిధులు కూడా ఉండొచ్చని సమాచారం. 2023లో అమెరికా-ఇరాన్ ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా దక్షిణ కొరియాలోని సుమారు 6 బిలియన్ డాలర్లను ఖతార్‌కు బదిలీ చేశారు. అయితే ఆ డబ్బును మానవతా అవసరాలకు మాత్రమే వినియోగించాలనే నిబంధనలు విధించారు.

వివరాలు 

భారత్ వద్ద సుమారు 7 బిలియన్ డాలర్ల ఇరానీ నిధులు

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి,అనంతరం యుద్ధం ప్రారంభమైన తర్వాత ఖతార్‌లో ఉన్న ఇరానీ నిధుల వినియోగంపై మళ్లీ పరిమితులు విధించారు. ఈ నిధులు పరోక్షంగా ఇరాన్ అనుబంధ సంస్థలకు ఉపయోగపడే అవకాశం ఉందన్న ఆందోళన అమెరికా వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారత్, చైనా, జపాన్, ఇరాక్ వంటి దేశాల్లో కూడా ఇరాన్‌కు సంబంధించిన చమురు, గ్యాస్ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. భారత్ వద్ద సుమారు 7 బిలియన్ డాలర్ల ఇరానీ నిధులు ఉన్నట్లు అంచనా.

వివరాలు 

జపాన్, లక్సెంబర్గ్ తదితర యూరోపియన్ దేశాల్లోనూ కొంత మొత్తం..

చైనా బ్యాంకులు ఇరాన్‌కు పదుల బిలియన్ డాలర్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. జపాన్, లక్సెంబర్గ్ తదితర యూరోపియన్ దేశాల్లోనూ కొంత మొత్తం నిలిచిపోయింది. అలాగే ఇరాక్ నుంచి ఇరాన్‌కు చెల్లించాల్సిన విద్యుత్, ఇంధన బకాయిలు కూడా భవిష్యత్తులో విడుదలయ్యే అవకాశముంది. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తుల్లో గణనీయమైన భాగం తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement