US-Iran War: ఇరాన్తో యుద్ధంలో అమెరికా డ్రోన్లకు భారీ నష్టం.. 45 MQ-9లు ధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా సైనిక డ్రోన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 45 MQ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. దీంతో అమెరికా సైన్యం వద్ద ఉన్న రీపర్ డ్రోన్లలో దాదాపు నాలుగో వంతు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి యుద్ధాన్ని అమెరికా ఇంకా ఎంతకాలం కొనసాగించగలదనే ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 45 రీపర్ డ్రోన్లు నష్టపోయినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ముగ్గురు అమెరికా అధికారులు వాషింగ్టన్ పోస్ట్కు తెలిపారు. MQ-9 రీపర్ డ్రోన్లను ప్రధానంగా నిఘా, పర్యవేక్షణతో పాటు లక్ష్యాలపై దాడులకు ఉపయోగిస్తారు.
వివరాలు
హోర్ముజ్ జలసంధి వద్ద డ్రోన్లకు ముప్పు
ఒక్కో డ్రోన్ ధర దాని పరికరాలు, ఆయుధాలను బట్టి 3కోట్ల డాలర్ల నుంచి 5 కోట్ల డాలర్ల వరకు ఉంటుంది.
ఈ లెక్కన కేవలం రీపర్ డ్రోన్ల నష్టంతోనే అమెరికాకు 130కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో MQ-9 రీపర్ డ్రోన్లను అమెరికా భారీగా మోహరించింది.
అయితే ఈ డ్రోన్ల నిర్మాణం కూడా వాటిని దాడులకు కొంత సులభమైన లక్ష్యంగా మారుస్తోంది.
రిమోట్ ద్వారా నడిచే ఈ విమానాలు సాపేక్షంగా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి.
తరచూ తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల ఇరాన్ బలగాలతో పాటు యెమెన్,ఇరాక్లోని దాని మిత్ర బృందాల నుంచి కూడా ముప్పు ఎదురవుతోంది.
వివరాలు
యుద్ధానికి ముందు అమెరికా వద్ద దాదాపు 185 MQ-9 రీపర్ డ్రోన్లు
అయితే కోల్పోయిన 45 డ్రోన్లలో అన్నీ శత్రు దాడుల్లో కూలిపోయినవి కావని తెలుస్తోంది.
కొన్నింటితో సంబంధాలు తెగిపోవడంతో వాటిని ఆపరేటర్లు నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోందని మరో అమెరికా అధికారి తెలిపారు.
అయితే ఇలా ఎన్ని డ్రోన్లు నష్టపోయాయన్న విషయాన్ని పెంటగాన్ వెల్లడించలేదు.
యుద్ధానికి ముందు అమెరికా సైన్యం వద్ద దాదాపు 185 MQ-9 రీపర్ డ్రోన్లు ఉన్నాయి.
వీటిలో 165 వైమానిక దళం,20 మెరైన్ కార్ప్స్ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటివరకు మెరైన్ కార్ప్స్కు చెందిన ఒక్క డ్రోన్ కూడా నష్టపోలేదని ఆ విభాగం అధికార ప్రతినిధి తెలిపారు.
అయితే అమెరికా వైమానిక దళం వద్ద ఉన్న రీపర్ డ్రోన్ల సంఖ్య ఇప్పటికే గణనీయంగా తగ్గింది.
వివరాలు
అమెరికా ఆయుధ నిల్వలపై అదనపు ఒత్తిడి
మే నెలలో లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ టాబోర్ సెనేటర్లకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. వైమానిక దళం వద్ద మిగిలిన రీపర్ల సంఖ్య సుమారు 135కి పడిపోయింది. డ్రోన్ల నష్టంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రోన్ల నష్టం ఒక్కటే అమెరికా రక్షణ శాఖ ఎదుర్కొంటున్న సమస్య కాదు.
ఇరాన్పై సైనిక చర్య ప్రారంభమైన తొలి నెలలోనే అమెరికా బలగాలు 850కి పైగా టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, 1,000కు పైగా పేట్రియాట్, THAAD ఇంటర్సెప్టర్లను ప్రయోగించినట్లు గతంలో వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
వివరాలు
అమెరికా ఆయుధ నిల్వలపై అదనపు ఒత్తిడి
ఇప్పటికే ఉక్రెయిన్కు అమెరికా అందిస్తున్న సుదీర్ఘకాల సైనిక సహాయంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఉంది.
ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి అవసరమవుతున్న ఆయుధాలు, పరికరాలు ఆ భారాన్ని మరింత పెంచుతున్నాయి.
ఖాళీ అవుతున్న ఆయుధ నిల్వలను తిరిగి నింపేందుకు ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి 67 బిలియన్ డాలర్ల నిధులను కోరుతోంది.
మరోవైపు, సెప్టెంబరు నాటికి ఈ యుద్ధానికి 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు.