Iran: ఆర్థిక యుద్ధంతో ఇరాన్ను దెబ్బతీయలేరు.. ట్రంప్పై అరాగ్చీ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో పేరుకుపోతున్న భారీ రుణాలు, వాటిపై పెరుగుతున్న వడ్డీ వ్యయాల వంటి అంతర్గత ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించింది. ఇప్పటికే విఫలమైన విధానాలను కొనసాగిస్తే.. భవిష్యత్తులోనూ ఓటమి, ఇరాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్ప మరేమీ ట్రంప్ సాధించలేరని పేర్కొంది. అమెరికా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను 'ఆర్థిక ఉగ్రవాదం'గా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అభివర్ణించారు. ఈ విధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, దేశాల సార్వభౌమాధికారానికి ముప్పుగా మారుతోందని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా రుణభారం పెంచిన ట్రంప్ విధానాలు..
అమెరికా రుణభారం 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సూచిస్తున్న మీడియా కథనాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అమెరికా ఆర్థిక క్రమశిక్షణను తిరిగి తీసుకొస్తానని అధ్యక్షుడు ట్రంప్ గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని కూడా అరాగ్చీ గుర్తుచేశారు.
అయితే, ఆయన అమలు చేసిన పలు విధానాలు అందుకు విరుద్ధంగా ఉండటంతో అమెరికా రుణభారం మరింత పెరిగిందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయని తెలిపారు.
సొంత దేశంలో ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించకుండా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా వాటి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
వివరాలు
ట్రంప్ ఆంక్షలు, అణ్వాయుధ హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
ఇరాన్ను ఆర్థికంగా బలహీనపర్చడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఇరాన్కు సహాయం చేసే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేసి ఓడించేందుకు మిత్రదేశాలన్నీ అమెరికాతో కలిసి నిలవాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు 'ట్రూత్ సోషల్' వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
ఇరాన్పై ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని మరింత పెంచే దిశగా అమెరికా చర్యలు కొనసాగుతున్న సమయంలో.. ట్రంప్ విధానాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ తీవ్రంగా వ్యతిరేకించారు.