Iran: సుప్రీం నాయకుడికి ఆరోగ్య సమస్యలు.. కరడుగట్టిన ఐఆర్జీసీ నాయకుల చేతుల్లోకి ఇరాన్..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య దేశ నాయకత్వం కీలక మార్పులకు లోనైందని సమాచారం. ప్రస్తుతం దేశ పాలనా బాధ్యతలుఐఆర్జీసీ (Islamic Revolutionary Guard Corps) లోని అతివాదుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సైనిక వ్యవహారాలు, విదేశాంగ నిర్ణయాలపై కూడా వీరే ఆధిపత్యం చెలాయిస్తున్నారని తెలుస్తోంది. ఈ దళానికి చెందిన ప్రధానాధికారి అహ్మద్ వహిద్, అతని అనుచరులు కీలక పదవులను చేపట్టి నిర్ణయాధికారాన్ని తమవైపు మళ్లించుకున్నారని సమాచారం. ఈ మార్పులతో మితవాద నాయకులు పాలన నుంచి దూరంగా నెట్టబడ్డారని కథనాలు సూచిస్తున్నాయి.
వివరాలు
హర్మూజ్ ప్రాంతాన్ని దిగ్బంధించిన.. వారాంతంలోనే ఈ అధికార మార్పులు
అమెరికా హర్మూజ్ ప్రాంతాన్ని దిగ్బంధించిన నేపథ్యంలో వారాంతంలోనే ఈ అధికార మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి మితవాద నేతలను పక్కన పెట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. శాంతి చర్చల సమయంలో హర్మూజ్ను తెరిచే అంశానికి ఆయన అంగీకరించినప్పటికీ, అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా హర్మూజ్ను మూసివేయాలనే అభిప్రాయం విప్లవ గార్డు వర్గాల్లో ఉన్నట్లు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. మరోవైపు అహ్మద్ వహిద్కు జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మహమ్మద్ బఘెర్ మద్దతు లభించడంతో ఆయన అధికార స్థానం మరింత బలపడినట్లు తెలుస్తోంది.