Netanyahu: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన రద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో భారత్ రావాల్సి ఉండగా, ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో పర్యటనను మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వివిధ కారణాల వల్ల ఇది వరుసగా మూడోసారి వాయిదా పడటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవల జరిగిన దిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 9న నెతన్యాహు భారత పర్యటన ప్లాన్ చేయగా, అప్పుడు అది రద్దయింది. అనంతరం సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంట్లో జరిగిన కీలక ఓటింగ్ కారణంగా మళ్లీ పర్యటన క్యాన్సిల్ అయింది.
వివరాలు
వచ్చే ఏడాదిలోనే పర్యటన
అంతకుముందు ఏప్రిల్లో కూడా ఇలాంటి ఆలస్యం చోటుచేసుకుంది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు ఘటనతో మూడోసారి పర్యటన ముందుకు జరగకుండా పోయింది. వచ్చే సంవత్సరం కొత్త తేదీలను సూచించే అవకాశం ఉందని సమాచారం. నెతన్యాహు 2018 జనవరిలో భారతదేశాన్ని సందర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2017లో టెల్ అవీవ్ వెళ్లి చరిత్ర సృష్టించారు. యూదు దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ మైలురాయిగా నిలిచారు. నెతన్యాహు-మోడీ మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసిందే. నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఈ ఘటన అనంతరం నెతన్యాహు భారత పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది.