
Pakistan: పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్పై బలోచ్ రెబల్స్ మరోసారి దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లో మళ్లీ బలోచ్ విప్లవకారులు జాఫర్ ఎక్స్ప్రెస్ (Jaffar Express) రైలుపై దాడి చేశారు. సింధ్-బలోచిస్థాన్ సరిహద్దులోని సుల్తాన్కోట్ ప్రాంతంలో క్వెట్టా వైపు వెళ్తున్న రైలు పట్టాలపై ముందుగానే పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. ఆ బలమైన విస్ఫోటన ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ దాడికి బలూచ్ విప్లవ సంస్థ "బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్" బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
వివరాలు
బందీల కోసం పాక్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్
ఈ సంవత్సరం జూన్లో కూడా సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ వద్ద ఇలాంటి పేలుడు సంభవించి, అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అంతకంటే ముందుగా మార్చి నెలలో ఇదే రైలు హైజాక్కు గురైంది. పాక్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఆ రైలును హైజాక్ చేసి, అందులోని వందలాది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. ఆ సమయంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాకిస్థాన్ భద్రతా దళాలపై దాడి చేసి, పలువురు అధికారులను చంపేశారు. ఆ తర్వాత పాక్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బందీలను సురక్షితంగా విడిపించింది.
వివరాలు
మిలిటెంట్ గ్రూప్లకు ఈ రైలు టార్గెట్
పాక్ లో బలోచ్ రెబల్స్, తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) గ్రూప్ ఈ రైలును లక్ష్యంగా చేసుకోవడం వెనక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి సాధారణంగా ఈ రైలును ఉపయోగించి సైనిక దళాలను క్వెట్టా నుండి పంజాబ్ ప్రాంతాలకు తరలిస్తుంటారు. దీంతో ఈ రైలు మిలిటెంట్ గ్రూపుల దృష్టిలో ప్రధాన లక్ష్యంగా మారిందని పాక్ అధికారులు వెల్లడించారు.