LOADING...
Masood Azhar: మసూద్ అజర్‌కు భారీ షాక్.. సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద మృతి!
మసూద్ అజర్‌కు భారీ షాక్.. సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద మృతి!

Masood Azhar: మసూద్ అజర్‌కు భారీ షాక్.. సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద మృతి!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై ఎన్నో భయానక ఉగ్రదాడులకు కారణమైన జైషే మహమ్మద్ (JeM) సంస్థ అధినేత మసూద్ అజర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతని సోదరుడు, సంస్థలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మరణించాడు. అయితే అతని మృతి సహజమా? లేక మరేదైనా కారణమా? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైషే మహమ్మద్ సంస్థ తన అధికారిక వేదిక ద్వారా తాహిర్ అన్వర్ మృతిని ధృవీకరించింది. సోమవారం రాత్రి బహావల్‌పూర్‌లోని జామియా మసీదు ఉస్మాన్ వలీలో అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించింది. కానీ అతని మరణానికి కారణం ఏమిటో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ మౌనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

వివరాలు 

పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్'

తాహిర్ అన్వర్ చాలా కాలంగా జైషే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, మసూద్ అజర్‌కు అత్యంత విశ్వసనీయుడిగా వ్యవహరించేవాడు. సంస్థలో అతని ప్రభావం గణనీయంగా ఉండేది. ఇదిలా ఉంటే, గత ఏడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్' చేపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా మసూద్ అజర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే అజర్ కుటుంబానికి చెందిన సోదరి, బావ, మేనల్లుడు సహా దాదాపు 10 మంది హతమైనట్లు సమాచారం వెలువడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాహిర్ అన్వర్ మరణం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

వివరాలు 

బహావల్‌పూర్ ప్రాంతంలో ఉన్న జైషే స్థావరాలపై దాడులు

జైషే మహమ్మద్ సంస్థ 2001లో జరిగిన భారత పార్లమెంట్‌పై దాడి, పఠాన్‌కోట్, ఉరి, పుల్వామా వంటి దాడుల వెనుక కీలకంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ దాడులకు ప్రతిగా భారత బలగాలు పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్ ప్రాంతంలో ఉన్న జైషే స్థావరాలపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో తమ ప్రధాన కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పలువురు సభ్యులు మరణించారని గత సెప్టెంబర్‌లో ఆ సంస్థకు చెందిన ఒక కమాండర్ పరోక్షంగా అంగీకరించిన విషయం తెలిసిందే.

Advertisement