LOADING...
Japan megaquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. ఇంకా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
జపాన్‌ను వణికించిన భూకంపం.. ఇంకా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక

Japan megaquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. ఇంకా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌లో భారీ భూకంప భయం నెలకొంది. ఉత్తర ప్రాంతంలోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దేశం ఒక్కసారిగా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:53 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. కేంద్ర బిందువు నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో కూడా పెద్ద భవనాలు కదిలిపోయేంత తీవ్రంగా కంపించింది. ఈ ఘటన అనంతరం జపాన్ వాతావరణ సంస్థ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసి, 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భారీ భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వివరాలు 

సునామీ అలల ప్రభావం

భూకంపం సంభవించిన దాదాపు 40 నిమిషాల తర్వాత ఇవాటేలోని కుజి పోర్ట్ వద్ద 80సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు తాకాయి. ప్రారంభంలో ఒక మీటర్ వరకు అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు,తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు భావించి హెచ్చరిక స్థాయిని తగ్గించారు. హొక్కైడో,ఆమోరి,ఇవాటే, ఫుకుషిమా ప్రాంతాల్లో జారీ చేసిన హెచ్చరికలను అర్ధరాత్రి సమయానికి పూర్తిగా ఎత్తివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో 1.82 లక్షల మందికి పైగా ప్రజలకు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోర్ట్ ప్రాంతాల్లో కూడా పెద్దగా నష్టం కనిపించలేదని జాతీయ ప్రసార సంస్థ నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

మరింత పెద్ద భూకంపం వస్తుందా?

భూకంపం తర్వాత మరో పెద్ద ప్రకంపనం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వచ్చే వారం రోజుల పాటు ఆఫ్టర్ షాక్స్ కొనసాగవచ్చని, ముఖ్యంగా రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలంగా కంపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశ ప్రధాని Sanae Takaichi హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని అంచనా వేయడానికి ప్రత్యేక అత్యవసర బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Advertisement

వివరాలు 

ఈ హెచ్చరిక ఎందుకు అరుదు?

జపాన్‌లో ఇలాంటి మెగా భూకంప హెచ్చరికలు చాలా అరుదుగా జారీ అవుతాయి. సోమవారం ఇచ్చిన ఈ హెచ్చరిక మూడోసారి మాత్రమే. 2024లో నాంకై ట్రఫ్ ప్రాంతంలో ప్రమాద సూచనలు కనిపించడంతో మొదటిసారి హెచ్చరిక ఇచ్చారు. 2025 డిసెంబర్‌లో ఉత్తర తీరంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత రెండోసారి హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతం సముద్రపు అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదులుతున్నందున భవిష్యత్తులో పెద్ద భూకంపాలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement