North Korea : కిమ్ ఉపగ్రహం.. వైట్ హౌస్, పెంటగాన్ ఫోటోలు తీసిందట.. ఉత్తర కొరియా సంచలన ప్రకటన
ఈ నెలలో తొలిసారిగా ఉత్తర కొరియా (North Korea) ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్, యూఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలను తీసింది. గతవారం అంతరిక్షంలోకి ప్రయోగించిన తన నిఘా ప్రోబ్ని ఉపయోగించి ఫోటోలు తీసినట్లు నార్త్ కొరియా సంచలన ప్రకటన చేసింది. గతంలో రెండుసార్లు నిఘా ఉపగ్రహాన్ని (Spy Satellite) భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈ దఫా రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఈ ఉపగ్రహంతో నార్త్ కొరియా శత్రువులపై నిరంతరం నిఘా పెట్టనుంది. ప్రస్తుతం ఈ ఉపగ్రహ పనితీరును పరిశీలిస్తున్నామని, డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో నిఘా పెడతామని వెల్లడించారు.
దక్షిణ కొరియాలోని సైనిక స్థవరాల ఫోటోలను తీసిన ఉపగ్రహం
అలాగే దక్షిణ కొరియాలోని సైనిక స్థావరాల చిత్రాలను తీసినట్లు తెలిసింది. అయితే నార్త్ కొరియా పంపించిన ఉపగ్రహం గురించి కానీ, దాని పనితీరు గురించి కానీ బయటి ప్రపంచానికి ఎలాంటి వివరాలు తెలియకపోవడం గమనార్హం. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఇక అణ్వస్త్ర సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఉత్తర కొరియా ఈ రాకెట్ ప్రయోగాలు చేస్తోందని ఇది వరకే న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.