Tehran Airport: టెహ్రాన్లో భారీ పేలుళ్లు.. మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్లో మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భారీ వైమానిక దాడులు జరిగినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీంతో ప్రాంతీయ ఘర్షణలు మరోసారి తీవ్రమయ్యాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, టెహ్రాన్లోని మెహరాబాద్ విమానాశ్రయంపై దాడులు జరిగాయని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విమానాశ్రయం ప్రాంతంలో మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టెహ్రాన్ తూర్పు, పడమర ప్రాంతాల్లో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ తెలిపింది.
Details
మౌలిక సదుపాయాలపై దాడులు
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్లోని ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలపై కొత్త దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. అదే సమయంలో ప్రతీకారంగా ఇరాన్ కూడా టెల్ అలీవ్పై క్షిపణి దాడులు చేసింది. అక్కడ ఆకాశంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ దాడులను అడ్డుకున్నట్లు సమాచారం. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ తీవ్ర సైనిక చర్యల కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో పౌరుల భద్రత, కీలక మౌలిక సదుపాయాలపై ప్రమాదం పెరిగింది. ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని వ్యూహాత్మకమైన షైబా చమురు క్షేత్రంను లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడులను సౌదీ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సమాచారం.
Details
ఒక క్రూజ్ క్షిపణిని కూడా అడ్డుకున్నట్లు వెల్లడి
సౌదీ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ టర్కి అల్-మలికి వెల్లడించిన వివరాల ప్రకారం, నాలుగు విడతల్లో ప్రయోగించిన 16 డ్రోన్లను రుబ్ అల్ ఖాలి ఎడారి ప్రాంతం (Empty Quarter) మీదుగా అడ్డుకుని ధ్వంసం చేశారు. ఈ డ్రోన్లు షయ్బా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్నాయని అధికారులు తెలిపారు. అలాగే ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణి, ఒక క్రూజ్ క్షిపణిని కూడా అడ్డుకున్నట్లు వెల్లడించారు. అదనంగా రియాధ్ తూర్పు ప్రాంతంలో మరో డ్రోన్ను కూల్చివేశారు. గత మూడు రోజులుగా అల్-ఖార్జ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Details
గల్ఫ్ దేశాల్లో వైమానిక ముప్పు
షయ్బా చమురు క్షేత్రం రుబ్ అల్ ఖాలి ఎడారి లోతుల్లో ఉన్న సౌదీ అరేబియాలోని అత్యంత పెద్ద చమురు క్షేత్రాలలో ఒకటి. ఇది సహజ వాయువు ఉత్పత్తి, పెట్రోకెమికల్ పరిశ్రమలకు కీలకమైన కేంద్రంగా భావించబడుతోంది. ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో వైమానిక ముప్పులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లోనే UAE రక్షణ వ్యవస్థలు 125కు పైగా డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు నివేదికలు తెలిపాయి. శుక్రవారం ఒక్కరోజే సౌదీ రక్షణ వ్యవస్థలు ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వైపు దూసుకొచ్చిన ఐదు క్షిపణులను, అలాగే రియాధ్ మరియు అల్ ఖర్జ్ ప్రాంతాల్లో అనేక డ్రోన్లను కూల్చివేశాయి. ఈ దాడులపై అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
Details
ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధం
అరబ్ లీగ్, ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ కూడా ఈ ఘటనలను ఖండించాయి. మార్చి 1న రియాధ్లో జరిగిన అత్యవసర సమావేశంలో గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు తమ భూభాగాలను రక్షించుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశాయి. మార్చి 3న మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా అవసరమైతే తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దేశ భూభాగం, పౌరులు నివాసితులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Tehran international airport planes fireballed by Israel pic.twitter.com/WPLToNT81b
— RT (@RT_com) March 7, 2026