Nepal: నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి
నేపాల్ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు నేపాల్లో మరణించిన వారి సంఖ్య 128కి చేరుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. పశ్చిమ నేపాల్లోని జాజర్కోట్ మరియు రుకుమ్ జిల్లాల్లో 140 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేపాల్ టెలివిజన్ పేర్కొంది. జాజర్కోట్లోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు, సహాయం చేసేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజన్సీలను మోహరించినట్లు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ కార్యాలయం తెలిపింది. భూకంపం నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో దిల్లీతో పాటు ఉత్తర భారతంలో ప్రకంపనలు వచ్చాయి.
భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
భూకంపం వల్ల దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా ఇతర జిల్లాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వ్యక్తులు ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజర్కోట్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిమాలయ దేశమైన నేపాల్లో భూకంపాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అక్టోబరు 3న 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని వల్ల దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. నవంబర్ 2022 లో, దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 12,000 మందికి పైగా మరణించారు.