Iran War: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఎస్ బలగాల భారీ తరలింపు.. వార్ అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సైనిక శక్తిని భారీగా మోహరిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలి పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంది. ఇందులో సుమారు 2,500 మంది మెరైన్లు ఉండగా, దీంతో ఈ ప్రాంతంలో మోహరించిన అదనపు అమెరికా బలగాల సంఖ్య 3,500 దాటింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. గత రెండు దశాబ్దాల్లో పశ్చిమాసియాలో అమెరికా ఇంత పెద్ద మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారి అని సమాచారం. అత్యాధునిక ఉభయచర యుద్ధనౌక అయిన యూఎస్ఎస్ ట్రిపోలి ఇటీవలి కాలంలో జపాన్ తీరంలో విధులు నిర్వర్తించింది.
వివరాలు
అత్యవసరంగా పశ్చిమాసియా ప్రాంతానికి
అయితే రెండు వారాల క్రితం దీన్ని అత్యవసరంగా పశ్చిమాసియా ప్రాంతానికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నౌకపై ఎఫ్-35 ఫైటర్ జెట్లు సహా అనేక యుద్ధవిమానాలను మోహరించే సామర్థ్యం ఉంది. ఇదిలా ఉండగా యూఎస్ఎస్ బాక్సర్తో పాటు శాన్డియాగో నుంచి బయలుదేరిన మరిన్ని నావికాదళ యూనిట్లు, అదనపు బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో, ఈ సైనిక కదలికలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ఏ క్షణానైనా అమెరికా భూదాడులకు దిగుతుందేమోనన్న ఆందోళనలు ఇరాన్లో వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఉద్రిక్త పరిస్థితులు
ఈ పరిణామాల మధ్య, ఇరాన్కు చెందిన ఆంగ్ల పత్రిక టెహ్రాన్ టైమ్స్ అమెరికా బలగాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 'వెల్కమ్ టూ హెల్' అనే శీర్షికతో ఫ్రంట్ పేజ్లో ప్రచురిస్తూ, ఇరాన్ నేలపై అడుగుపెట్టే ఏ అమెరికా సైనికుడైనా శవపేటికలోనే తిరిగి వెళ్తాడని తీవ్ర హెచ్చరిక చేసింది. మొత్తంగా పశ్చిమాసియాలో అమెరికా సైనిక కదలికలు, ఇరాన్ హెచ్చరికలు కలిసి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి.