Meloni: గాజా సాయం అడ్డుకోవడం అమానుషం.. ఇజ్రాయెల్పై ఇటలీ ప్రధాని ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో ఆకలి, దప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మానవతా సాయం అందించేందుకు సముద్ర మార్గంలో ప్రయాణం చేపట్టిన తమ దేశ పౌరులపై ఇజ్రాయెల్ బలగాలు అవమానకరంగా ప్రవర్తించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇటలీ పౌరులను అగౌరవపరిచినందుకు ఇజ్రాయెల్ అధికారికంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా నిర్బంధంలో ఉన్న ఇటలీకి చెందిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గాజా ప్రాంతానికి సముద్ర మార్గంలో వెళ్లే దారిని ఇజ్రాయెల్ పూర్తిగా నియంత్రిస్తూ,అంతర్జాతీయ సహాయం చేరకుండా అడ్డుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గాజా ప్రజలకు ఆహారం,అత్యవసర సహాయం అందించాలనే ఉద్దేశంతో 'గ్లోబల్ సుముద్ ఫ్లొటిల్లా' పేరుతో ఒక నౌక గత వారం తుర్కియే నుంచి బయలుదేరింది.
వివరాలు
చేతులు వెనక్కి కట్టి.. మోకాళ్లపై కూర్చోబెట్టి
అయితే ఆ నౌకను మధ్యలోనే అడ్డుకున్న ఇజ్రాయెల్ బలగాలు, అందులో ఉన్న సహాయక కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. నిర్బంధ సమయంలో వారి చేతులను వెనక్కి కట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టి, తలలను నేలకు ఆనించేలా వ్యవహరించిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ మంత్రి, అతివాద జాతీయవాది ఇటమార్ బెన్ గ్విర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం మరింత వివాదానికి దారితీసింది.