China missile: యెమెన్లో మిస్టరీ మిస్సైల్ శకలాలు.. చైనా క్షిపణిని సౌదీ వాడుతోందా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం యెమెన్లోని హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన క్షిపణులను సౌదీ అరేబియా వినియోగిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యెమెన్లో లభించిన ఓ మిస్టరీ మిస్సైల్ శకలాలే ఇందుకు కారణం. యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులు సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడుతున్నారు. ఇరాన్ మద్దతుతో హౌతీలు ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం. దీంతో సౌదీ అరేబియా కూడా హౌతీలపై ఎదురుదాడులకు దిగుతోంది. యెమెన్లోని హౌతీ స్థావరాలపై సౌదీ క్షిపణి దాడులు కొనసాగిస్తోంది.
వివరాలు
సౌదీ దాడిలో చైనా క్షిపణి శకలాలు?
రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా మరోసారి దాడి చేసింది.
ఈ దాడికి సంబంధించిన క్షిపణి శకలాలను సోమవారం యెమెన్ అధికారులు గుర్తించారు.
వాటిని పరిశీలించగా, అవి చైనాలో తయారైన డీఎఫ్-15ఏ క్షిపణికి చెందినవిగా తేలింది.
ఇది తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల చైనా తయారీ క్షిపణిగా తెలుస్తోంది. అయితే, అసలు ప్రశ్న ఇక్కడే మొదలైంది.
చైనా తయారు చేసిన క్షిపణి యెమెన్కు ఎలా చేరింది? సౌదీ అరేబియా చైనా నుంచి క్షిపణులను కొనుగోలు చేస్తోందా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
అధికారిక కొనుగోళ్లు జరగలేదా?
చైనా నుంచి సౌదీ అరేబియా అధికారికంగా ఎప్పుడూ క్షిపణులను కొనుగోలు చేయలేదని తెలుస్తోంది.
మరోవైపు, సౌదీ అరేబియాకు అమెరికాతో సైనిక ఒప్పందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా తయారీ క్షిపణి సౌదీ దాడిలో ఎలా ఉపయోగించబడిందనే చర్చ మొదలైంది.
ప్రపంచానికి తెలియకుండా సౌదీ అరేబియా ఏవైనా చైనా క్షిపణులను కలిగి ఉందా? లేక ఈ శకలాలు మరేదైనా మార్గంలో యెమెన్కు చేరాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు యెమెన్, సౌదీ అరేబియా, చైనా అధికారికంగా స్పందించలేదు.