Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. కోమాలో ఖమేనీ.. ఖోమ్లో అత్యవసర చికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన ఆయతొల్లా మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని 'ది టైమ్స్' నివేదిక వెల్లడించింది. ఇరాన్లోని పవిత్ర నగరం ఖోమ్లో ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఒక దౌత్యపరమైన మెమో ఆధారంగా 56 ఏళ్ల ఈ మత గురువు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంది. సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇప్పటివరకు ప్రజల్లోకి రాలేదు. ఇజ్రాయిల్,అమెరికా దాడుల్లో ఆయనకు తీవ్రమైన గాయాలు అయ్యాయని గత నివేదికలు సూచించాయి. ఖోమ్ నగరంలో తీవ్ర స్థితిలో మొజ్తబా చికిత్స పొందుతున్నారని, ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు గల్ఫ్ దేశాలతో పంచుకున్న నిఘా సమాచారంలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇరాన్ ఖోమ్ నగరంలో భారీ సమాధి నిర్మాణం..
ప్రస్తుతం ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొనలేని స్థితిలో ఉన్నారని సమాచారం. ఆయన ఉన్న ప్రదేశం గురించి అమెరికా, ఇజ్రాయిల్కు తెలిసినా, దాన్ని ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన యూఎస్-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అదే దాడిలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అలీ ఖమేనీ భౌతికకాయాన్ని ఖోమ్లో ఖననం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ నిఘా సంస్థల సమాచారం ప్రకారం ఖోమ్లో పెద్ద సమాధి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదే ప్రాంతంలో ఖమేనీ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.
వివరాలు
ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
ఈ సమాధి నిర్మాణంలో భాగంగా మొజ్తబా ఖమేనీని కూడా ఖననం చేసే అవకాశముందని టైమ్స్ నివేదిక పేర్కొంది. దీనివల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ విషయంపై వాషింగ్టన్ లేదా టెహ్రాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మొజ్తబా ఖమేనీ గాయాలపై ఇరాన్ కూడా ధ్రువీకరణ ఇచ్చింది. ఈ దాడిలో ఆయన తండ్రి, తల్లి, భార్య జహ్రా హద్దాద్-అడెల్, అలాగే కుమారుల్లో ఒకరు మరణించినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా ఆయన కోమాలో ఉన్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.