Imran Khan: ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి తరలించండి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇమ్రాన్ను ఆసుపత్రికి తరలించాలన్న ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ), కుటుంబ సభ్యుల చాలాకాలం డిమాండ్కు అనుగుణంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవల వచ్చిన వైద్య నివేదికలను ఉటంకిస్తూ వారు ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. పీటీఐ అధికార ప్రతినిధి నయీమ్ హైదర్ పంజూతా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ను 48 గంటల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వివరాలు
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. చూపు తగ్గిందన్న న్యాయవాదులు
సెప్టెంబర్ 16 వరకు ఆయనను అక్కడే ఉంచాలని సూచించింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు.
2022లో ప్రధాని పదవి నుంచి తొలగించిన తర్వాత తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన కుమారులు గత ఏడాది నుంచి పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.
జైలులో ఉన్న సమయంలో ఆయన కుడి కంటికి చూపు గణనీయంగా తగ్గిందని ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు కూడా తెలిపారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సైతం ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన వైద్య నివేదికలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు.
వివరాలు
ఇమ్రాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన.. వైద్య నివేదికలు కలవరపెడుతున్నాయన్న అల్వీ
ముఖ్యంగా ఇమ్రాన్లో ఆందోళన, గుండె దడ, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
ఎక్స్ వేదికగా స్పందించిన ఆరిఫ్ అల్వీ.. ఇమ్రాన్ వైద్య నివేదికలను తాను పలువురు నిపుణులతో కలిసి పరిశీలించానని తెలిపారు.
అందులోని అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇమ్రాన్ ఎదుర్కొంటున్న ఆందోళన, ఒత్తిడి స్థాయిలు, గుండె దడ, అధిక రక్తపోటు తనను కలవరపెడుతున్నాయని చెప్పారు.
నివేదికలో నిద్రలేమి గురించి ప్రస్తావించలేదని, అయితే ఆయనకు ఇస్తున్న మందులను బట్టి ఈ సమస్య కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
35ఏళ్లకు పైగా ఇమ్రాన్ ఖాన్ను తనకు తెలుసని, గతంలో ఒత్తిడి ఆయన బలహీనత కాదని అల్వీ పేర్కొన్నారు.
వివరాలు
ఇమ్రాన్ ఆరోగ్యంపై పీటీఐ ఆందోళన
అయితే ఇప్పుడు ఒత్తిడి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం.. మూడేళ్ల జైలు జీవితం,పూర్తిగా ఒంటరిగా ఉంచడం ఆయనపై ఎంత ప్రభావం చూపించాయో తెలియజేస్తోందని అన్నారు.
ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పీటీఐ స్వాగతించింది.
ఈ నిర్ణయం ఎంతో సంతోషకరమని,అయితే ఇది మరింత ముందే జరిగి ఉంటే ఆయన కంటి సమస్యతో పాటు మొత్తం ఆరోగ్యం ఇంతగా దెబ్బతినేది కాదని పీటీఐ ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ అన్నారు.
వైద్యులందరూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేసే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలని కోరారు.
2022లో అవిశ్వాస తీర్మానంలో ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్పై పలు కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ బహుమతుల వ్యవహారం, చట్టవిరుద్ధ వివాహం సహా అనేక కేసుల్లో ఆయనను దోషిగా తేల్చారు.
వివరాలు
ఇమ్రాన్కు మద్దతుగా క్రికెటర్లు..
అయితే కొన్ని కేసుల్లో శిక్షలు నిలిపివేయడం లేదా తీర్పులను రద్దు చేయడం జరిగింది. మరికొన్ని కేసుల్లో అప్పీలు కొనసాగుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ ఖండిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్కు జైలులో మెరుగైన వైద్యం, సరైన సౌకర్యాలు కల్పించాలని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ క్రికెటర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో డిమాండ్ చేశారు.
ఆయన జైలు పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో అధికారంలోకి వచ్చిన పీటీఐకి పాకిస్థాన్లోని కీలక ప్రావిన్సుల్లో ఇప్పటికీ గణనీయమైన మద్దతు ఉంది.
అయితే 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఎన్నికల గుర్తును కోల్పోవడంతో.. పీటీఐ అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయాల్సి వచ్చింది.