Nepal: ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజులకోసారి జీతం చెల్లింపు.. నేపాల్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాల విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు నెలకు ఒకసారి చెల్లించే జీతాలను ఇకపై 15 రోజులకోసారి రెండు దఫాలుగా చెల్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఆ దేశ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు పక్షానికి ఒకసారి జీతాలు చెల్లించడం వల్ల నెల మొత్తం వారి చేతుల్లో డబ్బు సులభంగా అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో వారు అవసరాల కోసం ఖర్చు చేయడంలో చురుకుదనం పెరుగుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం మెరుగవుతుందని వివరించారు. ఈ విధానం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దోహదపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఈ దేశాల్లో పక్షానికి ఒకసారి జీతాలు చెల్లించే విధానం
ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతించారు. పాఠశాల ఫీజులు, విద్యుత్, నీటి చార్జీలు వంటి బిల్లులు చెల్లించడం, రోజువారీ గృహ ఖర్చులు నిర్వహించడం ఈ విధానం ద్వారా సులభతరం అవుతుందని వారు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నిర్ణయం చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారులకు కూడా ఉపయోగపడనుంది. ఇప్పటికే పక్షానికి ఒకసారి జీతాలు చెల్లించే విధానం ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని నేపాల్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయించింది.