LOADING...
Hormuz: హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డంకులు.. 80 సముద్ర మైన్లు తొలగిస్తేనే లైన్ క్లియర్
హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డంకులు.. 80 సముద్ర మైన్లు తొలగిస్తేనే లైన్ క్లియర్

Hormuz: హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డంకులు.. 80 సముద్ర మైన్లు తొలగిస్తేనే లైన్ క్లియర్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 19, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిలో సాధారణ నౌకా రాకపోకలు వెంటనే పునరుద్ధరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జలసంధి మధ్య భాగంలో దాదాపు 80 సముద్ర మైన్లు (నావల్ మైన్స్) ఉండటంతో, వాటిని పూర్తిగా తొలగించిన తర్వాతే సాధారణ షిప్పింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) కుదిరిన తర్వాత గురువారం నుంచి కొన్ని నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా గల్ఫ్ ప్రాంతం నుంచి బయటకు రావడం ప్రారంభించాయి. అయితే కాల్పుల విరమణ కొనసాగినా కూడా మైన్లు, ఇతర అడ్డంకులు తొలగించేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో సాధారణ షిప్పింగ్ తిరిగి ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు

పూర్తిగా మూసివేసిన ప్రధాన నౌకా మార్గం..

స్వతంత్ర ట్యాంకర్ యజమానుల సంఘం ఇంటర్‌టాంకో మెరైన్ డైరెక్టర్ ఫిల్ బెల్చర్ మాట్లాడుతూ, "హోర్ముజ్ జలసంధి మధ్యలో ఉన్న ప్రధాన నౌకా మార్గం ప్రస్తుతం పూర్తిగా మూసివేయబడింది. ఆ మార్గంలో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. మా వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం జలసంధిలో దాదాపు 80 సముద్ర మైన్లు ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. వాటిని తొలగించడానికి గణనీయమైన సమయం పడుతుంది" అని తెలిపారు. యుద్ధం సమయంలో టెహ్రాన్, ఇరాన్-ఒమాన్ దేశాల మధ్య 1968 నుంచి అమల్లో ఉన్న ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్‌లోని జలసంధి మధ్య భాగంలో మైన్లు ఏర్పాటు చేసింది. ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకల రాకపోకలను పరిమితం చేయడమే దీని ఉద్దేశంగా పేర్కొంటున్నారు.

వివరాలు

జలసంధికి ఇరువైపులా.. 20 వేల మంది నావికులు

ఈ పరిస్థితుల కారణంగా దాదాపు 20 వేల మంది నావికులు జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయారు. అయితే కొన్ని నౌకలు రాత్రి వేళల్లో తమ ట్రాన్స్‌మిటర్లను ఆఫ్ చేసి, అమెరికా సహకారంతో ఒమాన్ తీరానికి సమీపంగా ప్రయాణించి బయటపడగలిగాయి. మరికొన్ని నౌకలు ఇరాన్ జలాల గుండా వెళ్లేందుకు చెల్లింపులు చేసి ప్రయాణించాయి. ఈ ఏర్పాటును "టెహ్రాన్ టోల్‌బూత్"గా పిలిచారు. సంఘర్షణకు ముందు ప్రతిరోజూ సుమారు 130 నౌకలు ఈ సాధారణ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణించేవి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అయ్యేది. అందువల్ల వీలైనంత త్వరగా పాత మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని షిప్పింగ్ రంగం కోరుకుంటోంది.

Advertisement

వివరాలు

జలసంధి వద్ద సిగ్నల్ జ్యామింగ్..

ఈ పరిస్థితిని ఫిల్ బెల్చర్ ఒక ఉదాహరణతో వివరించారు. "ఇది ఒక హైవేలో మధ్య రహదారి మూసివేసి, వాహనాలను రోడ్డు పక్కనున్న అత్యవసర లేన్‌లో నడిపిస్తున్నట్టే ఉంది. భారీ సంఖ్యలో నౌకలు సురక్షితంగా ప్రయాణించాలంటే ప్రధాన మార్గాన్ని తిరిగి తెరవాల్సిందే. ప్రస్తుతం దక్షిణ మార్గం, అంటే ఒమాన్ వైపు ఉన్న మార్గం రాళ్లకు చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో నౌకలు రాళ్లకు తాకే ప్రమాదం ఎక్కువగా ఉంది" అని చెప్పారు. ఇరుకైన సముద్ర మార్గం గుండా ఒకేసారి ఎక్కువ నౌకలు ప్రయాణించేందుకు ప్రయత్నిస్తుండటంతో పరస్పరం ఢీకొనే ప్రమాదం కూడా పెరుగుతోందని షిప్పింగ్ రంగం హెచ్చరిస్తోంది. దీనికి తోడు యుద్ధ సమయంలో ఇరాన్ చేపట్టినట్లు చెబుతున్న "సిగ్నల్ జ్యామింగ్" పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

Advertisement

వివరాలు

ప్రపంచ వాణిజ్యానికి మరింత అంతరాయం..

నౌకలు ఢీకొనడం, సముద్రంలో చిక్కుకుపోవడం లేదా మునిగిపోవడం వంటి ఘటనలు జరిగితే ప్రపంచ వాణిజ్యానికి మరింత అంతరాయం కలిగే అవకాశం ఉంది. 2021లో ఎవర‍్ గివెన్ కంటెయినర్ నౌక సూయెజ్ కాలువలో వారం రోజుల పాటు ఇరుక్కుపోవడంతో ప్రపంచ సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడిన ఘటనను షిప్పింగ్ సంస్థలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి నుంచి గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 600 నౌకలు ఇంకా లంగరు వేసి ఉన్నట్లు అంచనా. దీంతో పేరుకుపోయిన రద్దీని పూర్తిగా తొలగించడానికి కూడా గణనీయమైన సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement