LOADING...
North Korea: వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా దూకుడు.. అప్రమత్తమైన దక్షిణ కొరియా, జపాన్
వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా దూకుడు.. అప్రమత్తమైన దక్షిణ కొరియా, జపాన్

North Korea: వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా దూకుడు.. అప్రమత్తమైన దక్షిణ కొరియా, జపాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

కొరియా ద్వీపకల్పంలో మరోసారి యుద్ధ వాతావరణం ముసురుకుంటోంది. అంతర్జాతీయ హెచ్చరికలను పట్టించుకోకుండా కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఆదివారం ఉదయం వరుస బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ఏడాది ఆ దేశం నిర్వహిస్తున్న ఆయుధ పరీక్షల్లో ఇది తాజా ఘటన కావడం గమనార్హం. తూర్పు ఉత్తర కొరియాలోని సిన్పో తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) ధృవీకరించింది. ప్రయోగించిన క్షిపణులు ఉత్తర కొరియా తూర్పు తీరానికి సమీప సముద్రంలో పడిపోయి ఉండవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం ఇది నాలుగోసారి.

వివరాలు

అప్రమత్తమైన దక్షిణ కొరియా

ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు, అలాగే అమెరికా, జపాన్‌లతో నిరంతరం సమాచార మార్పిడి కొనసాగుతున్నట్లు రక్షణ అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ భద్రతా మండలి (NSC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం నిర్ణయించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా చర్యలపై జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్షిపణి పరీక్షలు ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ శాంతి భద్రతలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించింది. ఉత్తర కొరియా, బాలిస్టిక్ కార్యకలాపాలను నిషేధించే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తోందని మండిపడింది.

వివరాలు

సైన్యాన్ని పెంచేందుకు కృషి

గతవారం కిమ్ జోంగ్ఉన్ స్వయంగా ఒక డిస్ట్రాయర్ యుద్ధనౌక నుంచి నిర్వహించిన క్షిపణి పరీక్షను పర్యవేక్షించారు. దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని "భారీ స్థాయిలో విస్తరించాలనే" లక్ష్యంపై ప్రభుత్వం కేంద్రీకరిస్తోందని ప్రకటించారు. అణుదాడి సామర్థ్యాలను పెంచేందుకు సైన్యానికి కొత్త లక్ష్యాలను కూడా నిర్దేశించారు. ఇక అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఇటీవల వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్తర కొరియాలోని అణు కేంద్రాల్లో కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు తమ పరిశీలనల్లో గుర్తించినట్లు తెలిపారు. వరుస క్షిపణి ప్రయోగాలు, అణు సామర్థ్యాల పెంపుపై కిమ్ జోంగ్ ఉన్ ప్రకటనలు కలిసి చూస్తే, రాబోయే రోజుల్లో తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement