North Korea: కోవిడ్ కాలంలో ఉత్తర కొరియాలో భారీగా పెరిగిన మరణ శిక్షలు.. TJWG నివేదికలో షాకింగ్ విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉత్తర కొరియాలో మరణదండనలు గణనీయంగా పెరిగినట్టు ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (TJWG) తాజా నివేదిక వెల్లడించింది. సియోల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రకారం, 2020 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు కనీసం 153 మందికి మరణదండన విధించడం లేదా అమలు చేసినట్టు తెలిపింది. మహమ్మారి ముందు ఐదేళ్లలో ఈ సంఖ్య కేవలం 44 మాత్రమే ఉండడం గమనార్హం. 2020లో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేసిన తర్వాత మరణదండనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని నివేదిక చెబుతోంది. అంతర్జాతీయ పర్యవేక్షణ తగ్గిపోవడంతో పాలక వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించిందని పేర్కొంది.
వివరాలు
కిమ్ ఆదేశాల ఉల్లంఘనతో 600% పెరిగిన కేసులు
మతం, మూఢనమ్మకాలు, విదేశీ సాంస్కృతిక కంటెంట్.. ప్రత్యేకంగా K-డ్రామాలు, K-పాప్.. చూడటం వంటి కారణాలతోనే ఎక్కువగా మరణశిక్షలు విధించినట్టు వెల్లడించింది. ఇలాంటి కేసులు 250 శాతం పెరిగి ప్రధాన నేరాలుగా మారాయని నివేదిక తెలిపింది. అలాగే, కిమ్ ఆదేశాలను అతిక్రమించడం లేదా నాయకత్వాన్ని విమర్శించడం వంటి రాజకీయ కారణాల వల్ల శిక్షపడిన వారి సంఖ్య 600 శాతం పెరిగినట్టు వెల్లడించింది. ఈ నివేదిక 2011 నుంచి 2024 వరకు కిమ్ పాలనలో 51 నగరాలు, జిల్లాల నుంచి పారిపోయిన 265 మంది సాక్ష్యాల ఆధారంగా రూపొందించబడింది.
వివరాలు
మహమ్మారి సమయంలో మరణదండనలు అమలు చేసే ప్రాంతాల విస్తరణ
మహమ్మారి సమయంలో మరణదండనలు అమలు చేసే ప్రాంతాలు కూడా విస్తరించాయని, కోవిడ్కు ముందు 8 ప్రాంతాల్లో ఉండగా తర్వాత 19 ప్రాంతాలకు పెరిగినట్టు పేర్కొంది. భవిష్యత్తులో కిమ్ కుమార్తె జూ-ఏ వారసురాలిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ శిక్షలు మరింత పెరిగే అవకాశముందని TJWG హెచ్చరించింది. ఈ మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాలు స్పందించాలని, తమ నివేదికను పారిస్లో జరిగే వరల్డ్ కాంగ్రెస్ అగైనెస్ట్ ది డెత్ పెనాల్టీలో సమర్పిస్తామని న్యాయ నిపుణుడు ఈథన్ హీ-సియోక్ షిన్ తెలిపారు.