Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచెపై ఢాకా స్పందన.. 'ముళ్ల తీగలకు భయపడము'
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది. ముళ్ల తీగలతో తమ దేశాన్ని భయపెట్టలేరని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సలహాదారు ఎం.హెచ్. కబీర్ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన కబీర్.. అవసరమైన సందర్భాల్లో భారత్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గమనిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, భారత్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు.
వివరాలు
సరిహద్దు కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్కు భూములు
తమ దేశ సంబంధాలు ప్రధానంగా భారత కేంద్ర ప్రభుత్వంతోనే కొనసాగుతాయని కబీర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రెండు దేశాల నాయకత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణాన్ని ప్రారంభిస్తామని భాజపా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్కు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.