LOADING...
Hormuz: హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు అనుమతి.. ఇరాన్‌ కీలక నిర్ణయం
హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు అనుమతి.. ఇరాన్‌ కీలక నిర్ణయం

Hormuz: హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు అనుమతి.. ఇరాన్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ సహా తమకు మిత్రదేశాలుగా ఉన్న ఐదు దేశాల నౌకలకు హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి (Abbas Araghchi) వెల్లడించినట్టు ముంబయిలోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం 'ఎక్స్‌' (ట్విట్టర్‌) వేదికగా తెలిపింది. ఇరాన్‌ ప్రకటన ప్రకారం చైనా, రష్యా, భారత్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌ దేశాల నౌకలు హర్మూజ్‌ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చు. దీంతో ఇరువైపులా నిలిచిపోయిన భారత్‌కు చెందిన నౌకలకు మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్న నౌకలు తమ సరుకులతో గమ్యస్థానాలకు చేరే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇటీవల వచ్చిన కథనాల ప్రకారం, కనీసం ఐదు గ్యాస్‌ ట్యాంకర్లు హర్మూజ్‌ వద్ద అనుమతుల కోసం నిలిచిపోయాయి.

వివరాలు 

ట్యాంకర్ల ప్రయాణంపై కూడా త్వరలో స్పష్టత

తాజా నిర్ణయంతో ఈ ట్యాంకర్ల ప్రయాణంపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే మరిన్ని నౌకలు కూడా భారత్‌లోని పోర్టులకు చేరే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇదిలా ఉండగా,ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాల నౌకలకే హర్మూజ్‌ జలసంధిలో అనుమతి ఉంటుందని ఇరాన్‌ ముందుగానే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం కొనసాగుతోంది.

వివరాలు 

జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్‌ 

మరోవైపు హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్‌ విధించే అంశంపై ఇరాన్‌ పార్లమెంట్‌ చట్టం రూపొందించే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్నిబ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. టోల్‌ వసూలు చేసిన బదులుగా ఆ నౌకలకు భద్రత కల్పిస్తూ హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన అధికారిక ఫార్స్ వార్తా సంస్థను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ వివరాలు వెల్లడించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్మూజ్‌ జలసంధి ఓపెన్‌ చేసిన ఇరాన్

Advertisement