LOADING...
Operation Epic Fury: ఇరాన్‌లో బాలికల పాఠశాలపై భయంకర దాడి.. 150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు
150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు

Operation Epic Fury: ఇరాన్‌లో బాలికల పాఠశాలపై భయంకర దాడి.. 150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో జరిగిన మినాబ్ బాలికల పాఠశాలపై దాడి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా చేపట్టిన "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" కథనానికి ఇది పెద్ద దెబ్బగా మారింది. తాజా సమాచారం ప్రకారం,ఫిబ్రవరి 28న ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని మినాబ్ పట్టణంలో ఉన్న షజరె తయ్యెబెహ్ గర్ల్స్ స్కూల్ పై జరిగిన దాడికి అమెరికా దళాలే కారణమై ఉండొచ్చని అమెరికా దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనలో 7 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి వద్ద సంభావ్య యుద్ధ నేరంగా కూడా గుర్తించినట్లు సమాచారం.

వివరాలు 

ఈ దాడిని చేసింది ఇరాన్‌: అమెరికా 

అయితే ఈ దాడిని చేసింది ఇరాన్‌ అని వైట్ హౌస్ ఇప్పటివరకు చెబుతూ వస్తోంది. ఈ ఘటనపై వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. రాయిటర్స్‌తో మాట్లాడిన ఇద్దరు అమెరికా అధికారులు, ఈ దాడికి అమెరికా దళాలే కారణమై ఉండే అవకాశముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారని తెలిపారు. అయితే దాడిలో ఏ రకమైన ఆయుధం వాడారు, ఎవరి ఆదేశాలతో దాడి జరిగింది, ఎందుకు స్కూల్ లక్ష్యంగా మారింది వంటి అంశాలు ఇంకా స్పష్టంగా లేవని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, కొత్త ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, అవి అమెరికాను నిర్దోషిగా కూడా నిరూపించవచ్చని అధికారులు తెలిపారు.

వివరాలు 

పౌరుల మరణాల్లో ఇదే అతిపెద్ద ఘటన

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల మొదటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. మినాబ్‌లోని షజరె తయ్యెబెహ్ బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 150 మందికిపైగా విద్యార్థినులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని మొదట ఇరాన్ అధికారులు ఇజ్రాయెల్‌ను బాధ్యుడిగా ఆరోపించారు. ఇప్పటివరకు ఈ యుద్ధంలో జరిగిన పౌరుల మరణాల్లో ఇదే అతిపెద్ద ఘటనగా భావిస్తున్నారు. ఇరాన్ అధికారుల ప్రకారం మొత్తం 175 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు, వారిలో ఎక్కువ మంది 7 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలికలేనని తెలిపారు.

Advertisement

వివరాలు 

అమెరికా ఎప్పుడూ పౌరులు లేదా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయదు: కరోలైన్ లీవిట్

ఇక ఈ ఘటనపై అమెరికా వైట్ హౌస్ వేరే వాదనను వినిపించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ, ఈ దాడికి ఇరాన్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా ఎప్పుడూ పౌరులు లేదా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయదని ఆమె స్పష్టం చేశారు. అదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా వెల్లడించారు. ఒకవేళ ఈ దాడిలో అమెరికా పాత్ర ఉన్నట్లు తేలితే పెంటగాన్ దర్యాప్తు చేస్తుందని ఆయన అన్నారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ ఈ ఘటనపై ప్రశ్నలకు స్పందిస్తూ, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున వ్యాఖ్యానించడం సమంజసం కాదని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమోతి హాకిన్స్ తెలిపారు.

Advertisement