Pakistan: 'మా బిల్లు $800 మిలియన్లకు చేరింది': పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో సాధించిన ఆర్థిక పురోగతికి ఈ పరిణామం అడ్డంకిగా మారిందని తెలిపారు. ఈ ఘర్షణ కారణంగా దేశ చమురు దిగుమతి వ్యయం గణనీయంగా పెరిగి, 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్ల వరకు చేరిందని వెల్లడించారు. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారంగా మారిందని కేబినెట్ సమావేశంలో వివరించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొల్పి, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
వివరాలు
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ
ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టిన చర్యలను కేబినెట్కు వివరిస్తూ, ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య సుమారు 21 గంటల పాటు దీర్ఘకాల చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఈ చర్చలు దౌత్య పరంగా కీలక ముందడుగుగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ వంటి ఉన్నతాధికారుల సమన్వయంతో ఈ చర్చలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ కృషి ఫలితంగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని వివరించారు.
వివరాలు
అరఘ్చీ రష్యా పర్యటనకు ఫోన్ ద్వారా సంభాషణ
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తన బృందంతో పాకిస్థాన్ పర్యటన చేపట్టి పలు దఫాలు చర్చలు జరిపారని ప్రధాని తెలిపారు. తనతో రెండు గంటల పాటు సమావేశమై, తమ నాయకత్వంతో సంప్రదించిన అనంతరం సానుకూల నిర్ణయం తీసుకుంటామని అరఘ్చీ హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే అరఘ్చీ రష్యా పర్యటనకు ముందు తనతో ఫోన్ ద్వారా సంభాషణ జరిపారని చెప్పారు. ఒమన్లో జరిగిన సమావేశాలు కూడా సానుకూల దృక్పథంతో సాగాయని వివరించారు. త్వరలోనే ఈ వివాదానికి ముగింపు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాలు
రెండో విడత చర్చలకు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం
ఇదిలా ఉండగా, రెండో విడత చర్చలకు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. శాంతి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు ఉన్నత కమాండర్లు మరణించడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలతో ఈ వివాదం గల్ఫ్ ప్రాంతమంతటా వ్యాపించింది.