Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. వరుస బాంబు దాడులు, కాల్పులు.. 14 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో సోమవారం వరుసగా జరిగిన బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో మొత్తం 14 మంది మృతి చెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బజౌర్ జిల్లాలోని ఓ మత కళాశాల వద్ద ఆత్మాహుతి ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఢీకొట్టడంతో ఎనిమిది మంది పోలీస్, ఫ్రంటియర్ కార్ప్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు, పది మందికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఓ చిన్నారి కూడా మృతి చెందాడు. మరో ఘటనలో బన్ను పట్టణంలోని మిర్యాన్ పోలీస్ స్టేషన్ వద్ద రిక్షాలో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు పౌరులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.
వివరాలు
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చైనా జాతీయులే లక్ష్యంగా..
ఇదే సమయంలో శాంగ్లా జిల్లాలో తనిఖీ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఈ ఆపరేషన్లో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చినట్లు తెలిపారు. ఇటీవల ఇస్లామాబాద్లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడులో 31 మంది మృతి చెందడం, 169 మందికి గాయాలవ్వడం తరువాత ఈ దాడులు జరగడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు పెరిగిపోవడంతో 2025 ఏడాది పాకిస్తాన్కు గత పదేళ్లలోనే అత్యంత రక్తపాతంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.