'Smart Lockdown': పెట్రోల్ రేట్ల దెబ్బ.. పాకిస్తాన్లో లాక్డౌన్..
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు, హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడి, అనేక దేశాల్లో ఇంధన కొరత సమస్య తలెత్తింది. ఈ పరిణామాల ప్రభావం పాకిస్థాన్పై తీవ్రంగా పడింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆ దేశం, తాజా పరిస్థితుల్లో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యల భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7 నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జియో న్యూస్ వెల్లడించింది.
వివరాలు
ప్రధాన కేంద్రాల్లో మార్కెట్లు రాత్రి 9 గంటల వరకు
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో సోమవారం జరిగిన పెట్రోలియం ఉత్పత్తుల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆదేశం పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్తాన్,పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలకు వర్తిస్తుంది. ఈ ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కొన్ని డివిజనల్ ప్రధాన కేంద్రాల్లో మార్కెట్లు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచే అవకాశాన్ని ఇచ్చారు.
వివరాలు
దెబ్బతిన్న ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ
అదేవిధంగా బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఫుడ్ అవుట్లెట్లు,మ్యారేజ్ హాల్లు రాత్రి 10 గంటలలోపు కార్యకలాపాలను ముగించాలి. ప్రైవేట్ నివాసాల్లో జరిగే పెళ్లి కార్యక్రమాలకు కూడా అదే సమయ పరిమితి వర్తిస్తుంది. అయితే ఆసుపత్రులు,మెడికల్ షాపులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఫలితంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఇదివరకే ఖైబర్ పఖ్తూన్ఖ్వా,బలూచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన పొదుపు చర్యల కింద మార్కెట్లు, రెస్టారెంట్లు, పెళ్లి మందిరాల కార్యకలాపాలను ముందుగానే ముగించాలనే ఆదేశాలు జారీ చేశాయి.
వివరాలు
ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల తర్వాత ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణ గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. అంతేకాక ప్రపంచానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో నౌకాయానానికి ఆటంకం కలిగించింది. ఈ పరిణామాల ప్రభావంగా పాకిస్తాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మార్చి 6న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచింది.
వివరాలు
పెట్రోల్ ధర లీటరుకు రూ.378గా నిర్ణయం
అనంతరం ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.458.41కి, డీజిల్ ధర రూ.520.35కి చేరాయి. అయితే ప్రజలపై భారాన్ని కొంత తగ్గించేందుకు, ఒక రోజు తర్వాత ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పెట్రోలియం లెవీ తగ్గిస్తూ, పెట్రోల్ ధరను తాత్కాలికంగా ఒక నెలపాటు లీటరుకు రూ.378గా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇంధన సంక్షోభం వల్ల ఏర్పడుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు కూడా చేపట్టింది. వాటిలో నాలుగు రోజుల పని వారం ప్రతిపాదన, ఇంధన భత్యాల కోత, ప్రభుత్వ విభాగాల్లో 20 శాతం వ్యయ నియంత్రణ వంటి చర్యలు ఉన్నాయి.