Loading...
Shehbaz Sharif: PoKలో హింసాత్మక నిరసనలు.. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమన్న షెబాజ్ షరీఫ్
PoKలో హింసాత్మక నిరసనలు.. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమన్న షెబాజ్ షరీఫ్

Shehbaz Sharif: PoKలో హింసాత్మక నిరసనలు.. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమన్న షెబాజ్ షరీఫ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలపై పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్పందించారు. ధరల పెరుగుదల, అధిక విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక నిర్లక్ష్యం, వివాదాస్పద ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రాంతీయ సమస్యలను ఘర్షణలతో కాకుండా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

JAACతో చర్చలకు సుముఖత

గత రెండు నెలలుగా PoKలో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)తో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు షెబాజ్ షరీఫ్ సంకేతాలు ఇచ్చారు.

ఏ సమస్య ఎదురైనా ఇరుపక్షాలు పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.

PoKలో ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) కూడా ఇటీవల JAACతో చర్చలకు సానుకూలంగా స్పందించింది.

కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆందోళనకారులతో చర్చల ప్రక్రియ మరింత ముందుకు సాగుతుందని షెబాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

శాంతియుత నిరసనలకు అవకాశం

శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి, చర్చల కోసం ముందుకు వచ్చే వారికి కొత్త ప్రభుత్వం పూర్తి అవకాశం కల్పిస్తుందని పాక్ ప్రధాని స్పష్టం చేశారు.

అయితే ప్రాంతంలో అశాంతి, అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

అణచివేతతో పెరిగిన ఉద్రిక్తతలు

PoKలో జూన్‌ నుంచి ప్రారంభమైన నిరసనలు క్రమంగా తీవ్రరూపం దాల్చాయి.

ఆందోళనలను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు చేపట్టిన అణచివేత చర్యలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

12 శరణార్థి స్థానాల రద్దు డిమాండ్

ఈ ఉద్యమానికి సమాజంలోని అనేక వర్గాల నుంచి మద్దతు లభించింది. విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు సహా వివిధ వర్గాల ప్రజలు JAACకు అండగా నిలిచారు.

PoK అసెంబ్లీలో ఉన్న 12 వివాదాస్పద శరణార్థి స్థానాలను రద్దు చేయాలని JAAC ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.

ఈ స్థానాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో అధికార వర్గాలకు అదనపు రాజకీయ ప్రభావం లభిస్తోందని కమిటీ ఆరోపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

వివాదాస్పదంగా మారిన ఎన్నికలు

మరోవైపు PoKలో నిర్వహిస్తున్న మూడు విడతల ఎన్నికలు కూడా తీవ్ర వివాదానికి దారితీశాయి.

ఎన్నికల్లో రిగ్గింగ్, బ్యాలెట్ బాక్సుల లూటీ ఆరోపణలు రావడంతో పాటు భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

జూలై 27న, ఆగస్టు 3న తొలి రెండు విడతల పోలింగ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) 45 స్థానాలకు గాను 25 స్థానాలను గెలుచుకుంది.

మూడో విడత పోలింగ్ సోమవారం జరగాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలను వాయిదా వేశారు.

ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

వివరాలు 

PoKపై భారత్ స్పష్టమైన వైఖరి

ఇదిలా ఉండగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో భారత్‌ తన వైఖరిని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది.

PoK మొత్తం భారత్‌లో అంతర్భాగమని, పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించిందని భారత ప్రభుత్వం పేర్కొంటూ వస్తోంది.

ADVERTISEMENT