Iran Strikes: పేట్రియాట్, థాడ్, ఎంక్యూ-9 డిపోలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. గురువారం నిర్వహించిన తాజా దాడుల్లో అమెరికాకు చెందిన కీలక రక్షణ వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ వెల్లడించింది. కువైట్, జోర్డాన్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్ ప్రకటన ప్రకారం.. కువైట్లో ఉన్న అమెరికా పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ, ఎంక్యూ-9 డ్రోన్ల డిపో ధ్వంసమయ్యాయి. అలాగే జోర్డాన్లో ఏర్పాటు చేసిన థాడ్ (THAAD) రాడార్ వ్యవస్థను కూడా పూర్తిగా నాశనం చేసినట్లు పేర్కొంది. అమెరికా వరుస దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ వెల్లడించింది.
వివరాలు
భారీ హెలికాప్టర్ల మరమ్మతుల కోసం ఉపయోగించే గిడ్డంగి ధ్వంసం
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటనలో, జోర్డాన్లోని అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను అత్యంత వేగంగా ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
అంతేకాకుండా పేట్రియాట్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, సీ-రామ్ (C-RAM) రాడార్ వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపింది.
అదే సమయంలో భారీ హెలికాప్టర్ల మరమ్మతుల కోసం ఉపయోగించే పరికరాల గిడ్డంగిని కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది.
ఈ కేంద్రంలో హెలికాప్టర్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టేవారని వెల్లడించింది.
వివరాలు
'ఆపరేషన్ లైట్నింగ్' పేరుతో దాడులు
'ఆపరేషన్ లైట్నింగ్' పేరుతో కొనసాగుతున్న ఈ దాడుల్లో కువైట్లో ఉన్న అమెరికాకు చెందిన మూడు సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
అలాగే దోహాలోని అమెరికా స్థావరంలో ఉన్న మందుగుండు సామగ్రి, లాజిస్టిక్స్ డిపోలను తమ డ్రోన్లతో ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
ఇక కువైట్లోని అలీ అల్ సలీం ఎయిర్బేస్ కూడా తమ లక్ష్యంగా మారిందని ఐఆర్జీసీ తెలిపింది.
ఈ దాడిలో అక్కడ ఉన్న పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థతో పాటు ఎంక్యూ-9 డ్రోన్ల హ్యాంగర్ను పేల్చివేసినట్లు పేర్కొంది.
గమనిక: ఈ వివరాలు ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్జీసీ విడుదల చేసిన ప్రకటనల ఆధారంగా వెల్లడైనవి. అమెరికా నుంచి ఈ ఘటనలపై అధికారిక ధృవీకరణ లేదా స్పందన వెలువడలేదు.