US-Iran: 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశాలతో శాంతి చర్చలా?'.. పాక్పై మండిపడ్డ అమెరికా నేతలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కీలక శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించడాన్ని అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీవ్రంగా విమర్శించారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తూ, వారికి ఆశ్రయం కల్పించిన చరిత్ర ఉన్న దేశాలను నమ్ముకుని చర్చలు నిర్వహించడం సరైన విధానం కాదంటూ ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్లో పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులతో కలిసి జరిగిన చర్చల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడటం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన దేశాలపై రిక్ స్కాట్ విమర్శలు
ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా అమెరికా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికాకు నిజమైన మిత్రదేశాలు ఎవో గుర్తించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. పాకిస్తాన్, ఖతార్ దేశాలకు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడం, వారికి సహకరించడం వంటి అంశాల్లో దశాబ్దాల చరిత్ర ఉందని ఆరోపించారు. ఈ రెండు దేశాలు ప్రాంతీయ శాంతి కంటే ఇరాన్కు మద్దతు ఇవ్వడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని మండిపడ్డారు. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరినా ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకోవాలని స్పష్టం చేశారు.
వివరాలు
ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే: టిమ్ షీహీ
మరోవైపు మొంటానా సెనేటర్ టిమ్ షీహీ కూడా పాకిస్థాన్పై ఘాటు విమర్శలు చేశారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ దాదాపు పదేళ్లపాటు ఆశ్రయం కల్పించిన విషయాన్ని ఎవరూ మరచిపోకూడదని అన్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికా వ్యతిరేక తిరుగుబాటుదారులకు నిధులు అందించారని, అలాగే ఇరాన్ నాయకత్వానికి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అలాంటి దేశాలు అమెరికా-ఇరాన్ చర్చల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయని భావించడం పొరపాటేనని వ్యాఖ్యానించారు.
వివరాలు
అమెరికాకు నిజమైన మిత్రులు వీరే
మధ్యప్రాచ్యంలో అమెరికాకు విశ్వసనీయ భాగస్వాములు వేరే దేశాలేనని సెనేటర్ షీహీ అభిప్రాయపడ్డారు. ఖతార్ దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మనీలాండరింగ్ కార్యకలాపాల్లో సహకరిస్తోందని ఆరోపించారు. అందువల్ల అమెరికా-ఇరాన్ చర్చల్లో పాకిస్తాన్, ఖతార్లకు బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలను భాగస్వాములుగా చేర్చాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ దేశాలే అమెరికాకు నిజమైన మద్దతుదారులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాలకు అమెరికా మరింత స్పష్టమైన మద్దతు ప్రకటించాలని, భవిష్యత్తు వ్యూహాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సెనేటర్ షీహీ పిలుపునిచ్చారు.