Page Loader
Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత
పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత

Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో ముప్పు ఎదురైంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ముప్పు ముంచెత్తుతుండగా, రాజధాని ఇస్లామాబాద్‌లో పెట్రోలు, డీజిల్‌ లభ్యతపై ప్రభావం పడింది. తాజా నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్‌లో ఉన్న అన్ని ఫ్యూయల్‌ స్టేషన్లను రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి తదుపరి 48 గంటలపాటు బంక్‌లు పనిచేయవు. ఈ మేరకు పరిపాలనా యంత్రాంగం తక్షణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇంధన నిల్వలు తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Details

చమురు, డీజిల్‌ వంటి నిత్యావసరాలపై ఒత్తిడి

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో స్టాక్‌లను భద్రంగా ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ సైన్యం భారీగా ఆయుధాలను వినియోగిస్తోంది. దీనివల్ల చమురు, డీజిల్‌ వంటి నిత్యావసరాలపై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఆర్థికంగా తీవ్రంగా కుంగిపోయిన పాక్‌ ఐఎంఎఫ్‌ సహాయాన్ని మరోసారి ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF), పాకిస్థాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

Details

తీవ్రంగా మండిపడ్డ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి

ఈ నిర్ణయంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. 'పూంఛ్‌, రాజౌరి, ఉరి వంటి ప్రాంతాల్లో పాక్‌ తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటే, అలాంటి దేశానికి ఐఎంఎఫ్‌ ఎలా సాయం చేస్తోంది? ఆ దేశానికి బిలియన్‌ డాలర్ల మద్దతు ఇచ్చి, శాంతిని ప్రోత్సహిస్తున్నట్టు ఎలా చెబుతారని విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత్‌తో యుద్ధ మోహంలో ఉన్న పాక్‌కు దేశంలోని ఇంధన కొరత, ఆర్థిక అసమతుల్యతలు పెద్దసవాలుగా మారనున్నాయి.