PM Modi: జీ7 సదస్సులో మోదీ ప్రతిపాదన.. పేద దేశాల కోసం 'ఇంపాక్ట్' కార్యక్రమం
ఈ వార్తాకథనం ఏంటి
జీ7 ఔట్రీచ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న యుద్ధాలు,ఆర్థిక సంక్షోభాలు,ఇంధన కొరత వంటి సమస్యల ప్రభావం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను రక్షించేందుకు 'ఇంపాక్ట్' (International Mobilisation Partnership for Accelerating Connectivity and Trade)పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సులో మాట్లాడిన ఆయన..సంక్షోభాల భారాన్ని బలహీన దేశాలు ఒక్కటే మోయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జీ7 దేశాల పెట్టుబడులు,భారతదేశ ప్రతిభ,గ్లోబల్ సౌత్ దేశాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని మోదీ ప్రతిపాదించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక సహాయక వ్యవస్థలను రూపొందించి,ప్రపంచ సంక్షోభాల నుంచి వాటి ఆర్థిక వ్యవస్థలను కాపాడాలని సూచించారు
వివరాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం అత్యవసరం
ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మోదీ ప్రస్తావించారు. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడిన ఆసియా దేశాలు చమురు, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి జీ7 అధ్యక్ష దేశమైన ఫ్రాన్స్ ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధిని కేవలం జీడీపీ లేదా వాణిజ్య గణాంకాలతో కొలవడం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు. "వృద్ధి ఎవరి కోసం,ఎవరితో కలిసి,ఏ దిశగా సాగుతోంది?" అనే ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉందన్నారు. మానవ కేంద్రిత అభివృద్ధే భవిష్యత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.
వివరాలు
డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ
జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తో త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం జర్మనీ నాయకత్వంతో చర్చలు జరపనున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సురక్షిత వినియోగం, వేగవంతమైన అమలుపై నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మరో సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ. ఈ సమావేశంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, రక్షణ రంగం, ఇంధన భద్రత, కీలక ఖనిజాల సరఫరా, సాంకేతిక రంగంలో సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. జీ7 నాయకుల సమావేశంలో ఇప్పటికే ఇద్దరూ పరస్పరం పలకరించుకోవడం విశేషం.
వివరాలు
'వసుధైవ కుటుంబకం'
ఫ్రాన్స్లోని ఎవియన్-లే-బెయిన్స్ నగరం ప్రస్తుతం ప్రపంచ దౌత్యానికి కేంద్రంగా మారింది. భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న భారత్పై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్ కీలక పాత్ర పోషించగలదనే అభిప్రాయం బలపడుతోంది. జీ7 సమావేశంలో మోదీ మరోసారి 'వసుధైవ కుటుంబకం' సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భారతీయ తత్వమే తమ విదేశాంగ విధానానికి పునాది అని చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, 'ఏక్ పేడ్ మా కే నామ్' వంటి కార్యక్రమాలు ఈ ఆలోచనకు నిదర్శనమని వివరించారు.
వివరాలు
జీ7 ప్రత్యేక సమావేశంలోనూ పాల్గొనున్న మోదీ
అలాగే సమతుల్య, సమ్మిళిత, సుస్థిర ఆర్థికాభివృద్ధిపై జరిగే జీ7 ప్రత్యేక సమావేశంలోనూ మోదీ పాల్గొననున్నారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇప్పటికే కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పాటు కెన్యా, ఈజిప్ట్, జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలతో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశాల ద్వారా ప్రపంచ వేదికపై భారత దౌత్య ప్రాధాన్యం మరింత బలపడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జీ7 సదస్సులో మోదీ
At the G7 Summit in Evian, addressed the Outreach Session on ‘Reviving a Balanced, Shared and Sustainable Economic Growth for All.’ It is good that the French G7 Presidency has given importance to this topic.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
The reality today is- when it comes to growth, the question should… pic.twitter.com/qGQpCLbQPA