ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ సేవలు
ఫ్రాన్స్ వాసులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు భారత్లో అత్యంత విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI)ని ఇకపై ఫ్రాన్స్లో వాడుకోవచ్చని మోదీ ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపుల విధానం యూపీఐని ఉపయోగించుకునేందుకు భారత్ - ఫ్రాన్స్ అంగీకరించాయని మోదీ తెలిపారు. త్వరలోనే ఈఫిల్ టవర్ నుంచి ఫ్రాన్స్లో యూపీఐ సేవలను ప్రారంభిస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సమావేశానికి ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలోనే మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ గడ్డపై ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు ప్రధాన మంత్రి నివాళులు అర్పించారు. మరోవైపు ఫ్రాన్స్లో పర్యటించే ఇండియన్ టూరిస్టులు ఇకపై రూపాయాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చని వెల్లడించారు.
యూపీఐ సేవలను కలిగిన తొలి యూరోపియన్ దేశంగా అవతరించనున్న ఫ్రాన్స్
నగదు రహిత తక్షణ చెల్లింపుల్లో ఇదో మైలురాయి అని మోదీ అన్నారు. దీంతో యూపీఐ సేవలను కలిగిన తొలి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ అవతరించనుంది. అంతర్జాతీయ వేదికపై భారత్ బలం, పాత్ర పెరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీ20 సదస్సుకి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని గుర్తుచేశారు. భారత్ -ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రజలే అనుసంధానకర్తలని ప్రధాని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రవాసీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. మరోవైపు భారత్ను పెట్టుబడులకు కేంద్రంగా ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతొన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా వారి మనసు మాత్రం భారత్లోనే ఉంటుందని మోదీ అన్నారు.