అబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అలాగే ఇరు దేశాధినేతల మధ్య పలు వాణిజ్య, పెట్టుబడి అంశాలపై ఒప్పందాలు జరిగాయి. అబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు భారత్ - యూఏఈ మధ్య ఆర్థిక సహకారానికి అంగీకరించాయి. సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇరు దేశాలు ముందడుగు వేశాయి. యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్ఫారమ్ (ఐపీపీ), భారత్కు చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)ని అనుసంధానానికి ఇరు దేశాధినేతలు అంగీకరించాయి.
యూఏఈని భారత్ నిజమైన స్నేహితుడిగా పేర్కొన్న మోదీ
యూఏఈతో ఒప్పందాలను ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. యూఏఈని భారత్ నిజమైన స్నేహితుడిగా చూస్తున్నట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూఏఈతో చేసుకున్న ఒప్పందాలు మెరుగైన ఆర్థిక సహకారానికి మార్గాన్ని సుగమం చేస్తాయని చెప్పుకొచ్చారు. అబుదాబిలో ఐఐటీ-దిల్లీ ఏర్పాటు వల్ల విద్యా అంతర్జాతీయీకరణలో గణనీయమైన భారత పురోగతిని సూచిస్తుందన్నారు. విద్య అనేది ఇరు దేశాలను కలిపే బంధమని మోదీ పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని మోదీ ట్వీట్ చేశారు. తాము సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించే మార్గాలతో సహా ఇతర అంశాలపై కూడా చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు.