ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం
పసిఫిక్ ద్వీప దేశాలైన ఫిజీ, పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అరుదైన గౌరవం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత గౌరవం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ'ని రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ప్రధాన మంత్రి సితివేని రబుకా ప్రదానం చేశారు. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు, గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహించినందుకు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే ప్రధాని మోదీని 'కంపానియన్ ఆఫ్ ఆర్డ్ ఆఫ్ లోగోహు'తో సత్కరించారు. గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఉన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
పసిఫిక్ ద్వీప దేశాల కోసం 12 దశల ప్లాన్
పసిఫిక్ ద్వీప దేశాలతో భారత్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 12 దశల ప్లాన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన ప్లాన్ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేరుస్తుందని, ఇండో-పసిఫిక్ భాగస్వామ్య దృష్టిని ఏకీకృతం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. పాపువా న్యూ గినియాలో జరిగిన 3వ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) సమ్మిట్కు కో-అధ్యక్షుడుగా హాజరైన ప్రధాని ఈ ప్రకటన చేశారు. భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో ప్రధాని మోదీ ప్రకటించిన 12 దశల ప్లాన్ను షేర్ చేశారు.
ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
పాపువా న్యూ గినియాలో పర్యటన ముంగించుకున్న ప్రధాని ఆస్ట్రేలియాకు బయలుదేరారు. సిడ్నీలో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వాస్తవానికి సిడ్నీలో క్వాడ్ సమావేశం జరగాల్సింది. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గైర్హాజరు కావడంతో క్వాడ్ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలో మోదీ ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ముందే ఖరారు కాగా, ఆయన సిడ్నీకి బయలుదేరారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ పీఎం ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఆర్థిక సహకార ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలు సహా వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు జరపనున్నారు.