France Wildfires: ఫ్రాన్స్లో దావానలం బీభత్సం.. బోట్లలో వందలాది టూరిస్టుల తరలింపు!
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్లో అటవీ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో దావానలం వేగంగా వ్యాపిస్తూ భారీ నష్టం కలిగిస్తోంది. మంటలు అదుపు తప్పడంతో అక్కడ నివసిస్తున్న వందలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డియాక్స్కు పశ్చిమంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించారు. గిరోండే ప్రాంతంలో చెలరేగిన అటవీ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది గత కొన్ని రోజులుగా నిరంతరం శ్రమిస్తున్నారు. సౌమోస్ ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు వేగంగా విస్తరించి, ఇప్పటివరకు సుమారు 21 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బూడిద చేసింది .
వివరాలు
4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ వెల్లడించిన వివరాల ప్రకారం క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పం నుంచి ఇప్పటికే 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ అగ్నిప్రమాదంలో 80 ఇళ్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 50 ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
మరోవైపు, పొరుగుదేశమైన స్పెయిన్లో కూడా అటవీ మంటలు తీవ్రరూపం దాల్చడంతో జాతీయ అత్యవసర పరిస్థితిని (National Emergency) ప్రకటించారు.
దేశ రాజధాని మాడ్రిడ్ సమీప ప్రాంతాల వరకు కూడా మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అత్యవసర చర్యలు కొనసాగుతున్నాయి.