PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం ప్రదానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం దక్కింది. ఉజ్బెకిస్థాన్ స్వాతంత్య్ర 35వ వార్షికోత్సవం సందర్భంగా మోదీకి 'ఓలీ దరాజ్లీ దోస్త్లిక్' పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్తో పాటు దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తనకు లభించిన 'ఓలీ దరాజ్లీ దోస్త్లిక్' పురస్కారాన్ని మోదీ భారతీయులకు అంకితం చేశారు.
వివరాలు
మోదీ, మిర్జియోయెవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు
ప్రధాని మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య ఆదివారం తాష్కెంట్లో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి.
కుక్సారోయ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో భారత్-ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించారు.
వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
భవిష్యత్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు, కార్యాచరణ ప్రణాళికపైనా మోదీ, మిర్జియోయెవ్ చర్చలు జరిపారు.
వివరాలు
మోదీకి ఘన స్వాగతం
ఈ ప్రతినిధుల స్థాయి చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు తాష్కెంట్లో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు.
శనివారం ఉజ్బెకిస్థాన్ చేరుకున్న మోదీకి మిర్జియోయెవ్ విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికారు.
అనంతరం ఇరువురు నేతలు కలిసి కారులో అధ్యక్ష భవనానికి వెళ్లారు. ఆ తర్వాత విందు సమావేశంలోనూ పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్కు ప్రధాని మోదీకి ఇది నాలుగో పర్యటన.
వివరాలు
యోగా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ
మోదీ పర్యటన సందర్భంగా తాష్కెంట్లోని హిల్టన్ హోటల్ సహా పలు ప్రముఖ భవనాలను భారత త్రివర్ణ పతాకంలోని రంగులతో అలంకరించారు.
భారత ప్రవాసులు కూడా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భారత, ఉజ్బెక్ సంప్రదాయాలను మేళవించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తన ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్థాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతీయ సమాజంతో తన సమావేశాలు, యాంగీ ఉజ్బెకిస్థాన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను 'ఎక్స్'లో పంచుకున్నారు.
భారత ప్రవాసులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రశంసించారు.
వివరాలు
యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్ను సందర్శించిన మోదీ
ప్రధాని మోదీ యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్ను కూడా సందర్శించారు. అక్కడి స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ కూడా మోదీ వెంట ఉన్నారు.
'ఉడే జబ్ జబ్ జుల్ఫేన్ తేరీ' పాటకు బాలీవుడ్ బ్యాటిల్ గ్రూప్ ఇచ్చిన ప్రదర్శన, కథక్-అందిజన్ పోల్కా ఫ్యూజన్, లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ విద్యార్థులు ప్రదర్శించిన కథక్ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.