Loading...
Russia: రష్యా పంజా.. లక్ష్మీ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై క్షిపణి దాడి.. ఇద్దరి మృతి
రష్యా పంజా.. లక్ష్మీ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై క్షిపణి దాడి.. ఇద్దరి మృతి

Russia: రష్యా పంజా.. లక్ష్మీ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై క్షిపణి దాడి.. ఇద్దరి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ఇరు దేశాలు పరస్పరం డ్రోన్‌ దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్‌ స్టీల్‌ ప్రాంతంపై రష్యా క్షిపణి దాడి చేసింది. భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్లాంట్‌ కూడా ఈ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. క్రివీ రిహ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్వస్థలం కావడం గమనార్హం.

వివరాలు 

కీలక ఉత్పత్తి విభాగాలకు నష్టం

రష్యా క్షిపణి దాడితో మిట్టల్‌ ప్లాంట్‌లోని కీలక ఉత్పత్తి విభాగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ముఖ్యంగా విద్యుత్‌ వ్యవస్థలు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు దెబ్బతిన్నాయి.

దీంతో ప్లాంట్‌లోని కొన్ని ఉత్పత్తి ప్రక్రియలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

నష్టం ఎంతమేర జరిగిందనే విషయాన్ని అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు.

మృతుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

ఆర్థిక నష్టం ఎంతంటే?

దాడి కారణంగా జరిగిన ఆర్థిక నష్టంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అంచనా వెలువడలేదు.

అయితే భారీ స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో మరమ్మతుల వ్యయం పెరగడంతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

నష్టం తీవ్రతపై పూర్తి స్థాయి పరిశీలన పూర్తయిన తర్వాతే ఆర్థిక నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

ADVERTISEMENT

వివరాలు 

90 ఏళ్ల చరిత్ర.. ఉక్రెయిన్‌ పరిశ్రమకు వెన్నెముక

లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌ క్రివీ రిహ్‌ ప్లాంట్‌ సాధారణ ఉక్కు కర్మాగారం కాదు.

దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ భారీ పరిశ్రమ నిర్మాణం 1931లో అప్పటి సోవియట్‌ యూనియన్‌ పాలనలో ప్రారంభమైంది.

1934 ఆగస్టులో ఇక్కడ తొలిసారిగా ఉక్కు ఉత్పత్తి చేశారు. అప్పట్లో క్రివొరిజ్‌స్టల్‌ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ కర్మాగారం.. క్రమంగా ఉక్రెయిన్‌ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది.

2005లో లక్ష్మీ మిట్టల్‌ నేతృత్వంలోని మిట్టల్‌ స్టీల్‌ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్‌ను సుమారు 4.8 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.

అనంతరం ఆర్సెలర్‌తో మిట్టల్‌ స్టీల్‌ విలీనం కావడంతో ఇది ఆర్సెలర్‌ మిట్టల్‌ క్రివీ రిహ్‌గా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

90 ఏళ్ల చరిత్ర.. ఉక్రెయిన్‌ పరిశ్రమకు వెన్నెముక

ప్లాంట్‌ స్వాధీనం తర్వాత ఆధునీకరణ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ ప్రమాణాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు.

ఇనుప ఖనిజాన్ని ఉక్కుగా మార్చే ప్రక్రియలోని అనేక దశలు ఒకేచోట జరిగే ఈ ప్లాంట్‌.. ఉక్రెయిన్‌ ఉక్కు పరిశ్రమకు అత్యంత కీలకమైన సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.

అందుకే ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమపై రష్యా క్షిపణి దాడి జరగడం కేవలం ఒక కంపెనీకి జరిగిన నష్టంగా మాత్రమే కాకుండా.. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడికి మరో ఉదాహరణగా నిలిచింది.

వివరాలు 

డ్రోన్‌ దాడులకు ప్రతీకారమేనా?

ఉక్రెయిన్‌ రష్యాలోని పలు ప్రాంతాలపై భారీగా డ్రోన్‌ దాడులు చేసిన తర్వాతే ఈ క్షిపణి దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ దాడుల్లో రష్యాలో ప్రాణనష్టం సంభవించడంతో.. అందుకు ప్రతీకార చర్యల్లో భాగంగానే మాస్కో ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం.

అయితే ఉక్రెయిన్‌లో తాము సైనిక, పారిశ్రామిక లక్ష్యాలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నామని రష్యా ప్రకటిస్తోంది.

క్రివీ రిహ్‌లోని మెటలర్జికల్‌ ప్లాంట్‌ కూడా తమ లక్ష్యాల్లో ఒకటేనని రష్యా పేర్కొంది.

అయితే క్రివీ రిహ్‌ జెలెన్‌స్కీ స్వస్థలం కావడంతో ఈ ప్రాంతంపై రష్యా దాడులు కొనసాగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

యుద్ధంలో కొత్త దశ

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సుదీర్ఘమవుతున్న కొద్దీ ఇరు దేశాలు తమ సరిహద్దులకు అవతల ఉన్న దూర ప్రాంతాలపైనా దాడులను పెంచుతున్నాయి.

సైనిక స్థావరాలతో పాటు విద్యుత్‌ కేంద్రాలు, ఇంధన వనరులు, పారిశ్రామిక సంస్థలు కూడా దాడులకు లక్ష్యాలుగా మారుతున్నాయి.

జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్‌పై గతంలోనూ రష్యా దాడులు చేసింది.

తాజాగా మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై జరిగిన క్షిపణి దాడి.. యుద్ధం ప్రభావం ఉక్రెయిన్‌ ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థపై ఏ స్థాయిలో పడుతోందో మరోసారి స్పష్టం చేసింది.

ADVERTISEMENT