
Russia: ఉక్రెయిన్పై రష్యా భారీ గగనతల దాడి.. ఇప్పటి వరకు అతి పెద్ద దాడిగా వెల్లడి!
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరో కీలక మలుపు తిరిగింది. శనివారం రాత్రి రష్యా చేపట్టిన గగనతల దాడి ఇప్పటి వరకూ అత్యంత భారీ దాడిగా నమోదైంది. మొత్తం 537 ఆయుధాలను ప్రయోగించగా, అందులో 477 డ్రోన్లు, 60 క్షిపణులున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వాయుసేన అధికారికంగా వెల్లడించింది. వాటిలో 249 ఆయుధాలను నాశనం చేయగలిగామని, మిగిలిన 226 డ్రోన్లు ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని వివరించింది. ఈ దాడిపై ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ స్పందించారు. 'ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద గగనతల దాడి అని పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై దాడులు జరిగినట్టు తెలిపారు.
Details
17 మందికి గాయాలు
ఈ దాడుల్లో ఖెర్సాన్ ప్రావిన్స్లో ఒకరు మృతి చెందినట్లు గవర్నర్ వెల్లడించగా, ఉక్రెయిన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయి పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు మిలిటరీ పేర్కొంది. ఇప్పటి వరకు రష్యా మూడుసార్లు ఎఫ్-16లను కూల్చివేసినట్టు సమాచారం. మరోవైపు ఒడెసాలో ఓ అపార్ట్మెంట్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక దంపతులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. అపార్ట్మెంట్లోని మూడు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా మాత్రం ఉక్రెయిన్ డ్రోన్లపై ప్రతిదాడికి దిగింది. పశ్చిమ రష్యా, క్రిమియా ప్రాంతాల్లోకి ప్రవేశించిన 40 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
Details
కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్
ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెలారస్ రాజధాని మిన్స్క్లో విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్లో యుద్ధాన్ని పురికొల్పడంలో పశ్చిమ దేశాల ప్రమేయం ఉంది. నాటో విస్తరణతో పాటు వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక రష్యాలో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పశ్చిమ దేశాలే ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. మాస్కోలో ఇటీవల సంభవించిన పేలుళ్లపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.