Russia Uranium Imports: రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేస్తున్న అగ్రరాజ్యం! .. ఆంక్షలు అమెరికాకు వర్తించవా..
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కొత్త చట్టానికి మార్గం సుగమమైంది. 'లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026'కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ద్వారా రష్యా ఇంధనం కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లభించనుంది. అయితే ఈ సుంకాలు ఆటోమేటిక్గా అమల్లోకి రావు. వాటిని విధించాలంటే ట్రంప్ తన అధికారాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
వివరాలు
యురేనియం దిగుమతులపై పరిమిత మినహాయింపులు
రష్యా నుంచి వచ్చే అణు ఇంధనంపై మాత్రం అమెరికా పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించలేదు.
ముఖ్యంగా రష్యా నుంచి లభించే తక్కువ సాంద్రత యురేనియం (LEU) దిగుమతులకు పరిమిత మినహాయింపులు కొనసాగుతున్నాయి.
అమెరికా అణు విద్యుత్ రంగానికి రష్యా ఇంధన సరఫరా ఇప్పటికీ కీలకంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
2028 వరకు కొనసాగే వెసులుబాటు
2024లో అమెరికా.. రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఆంక్షలు విధించింది.
అయితే దేశీయ అణు రియాక్టర్లకు ప్రత్యామ్నాయ ఇంధనం అందుబాటులో లేని పరిస్థితుల్లో లేదా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే దిగుమతులకు మినహాయింపు ఇచ్చే అవకాశం కల్పించింది.
ఈ మినహాయింపులు 2028 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగనున్నాయి.
వివరాలు
అమెరికా అణు రంగంలో రష్యా వాటా ఎంతంటే..
అమెరికా అణు విద్యుత్ రంగానికి రష్యా యురేనియం ఎంత ముఖ్యమో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025లో అమెరికా పౌర అణు విద్యుత్ రియాక్టర్ల నిర్వాహకులు కొనుగోలు చేసిన ఎన్రిచ్మెంట్ సేవల్లో రష్యా వాటా 26 శాతంగా ఉంది.
అదే సమయంలో అమెరికా 23 శాతం, ఫ్రాన్స్ 18 శాతం, బ్రిటన్ 14 శాతం, నెదర్లాండ్స్ 8 శాతం వాటాను అందించాయి.
రష్యాతో అణు ఇంధన సంబంధాలను ఒక్కసారిగా తెంచుకోవడం అమెరికాకు సులభం కాదు.
ఒకవైపు రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు దేశీయ అణు విద్యుత్ వ్యవస్థకు ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
వివరాలు
భారత్పై మాత్రం కొనసాగుతున్న ఒత్తిడి
ఇదే సమయంలో రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి పెరుగుతోంది.
కొత్త చట్టం కింద ట్రంప్ భారత్పై 100 శాతం వరకు టారిఫ్ విధించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి భారత్పై అలాంటి కొత్త 100 శాతం సుంకం విధించలేదు.